హైదరాబాద్, జూన్ 23 (నమస్తే తెలంగాణ) : ఫీజు రీయింబర్స్మెంట్ పథకంపై గంపెడాశతో చదువుకుంటున్న విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. బంగారు భవిష్యత్తుపై ఆశలు పెట్టుకున్న వారి పరిస్థితి ప్రశ్నార్థకమవుతున్నది. సర్కార్ ఫీజు బకాయిలను విడుదల చేయకపోవడం.. చదువులు పూర్తికావడం.. సర్టిఫికెట్లు చేతికందకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఫీజు బకాయిల విషయంలో కాంగ్రెస్ సర్కార్ విద్యార్థులను మోసం చేసింది. దారుణాతిదారుణంగా వంచించింది. పాత బకాయిలు చెల్లించబోమంటూ చెబుతున్నది. పాత బకాయిలతో సంబంధంలేదని మొండికేస్తున్నది. చివరగా విద్యార్థులే చెల్లించుకోవాల్సిన పరిస్థితి తీసుకొచ్చింది. సర్కార్ తీరుతో విద్యార్థులు రోడ్డెక్కుతున్నారు. తాజాగా విద్యార్థులు కాలేజీకి తాళాలువేసి ఆందోళనకు దిగారు.
ఫీజు బకాయిలు భారీగా పేరుకుపోవడంతో కాలేజీ యాజమన్యాలు దూకుడు పెంచుతున్నాయి. కొన్ని ప్రముఖ కాలేజీలైతే ఫీజు బాకీ లు చెల్లించే వరకు సర్టిఫికెట్లు ఇవ్వడంలేదు. ముఖ్యంగా పరీక్షలప్పుడు విద్యార్థులను తెగ ఇబ్బందులు పెడుతున్నాయి. కోర్సు పూర్తైనా.. విద్యాసంవత్సరం ముగిసినా విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వడంలేదు.
ఫీజు బకాయిలతో విద్యార్థులకు మూడు రకాల ఇబ్బందులు తప్పడంలేదు. విదేశీ చదువులు.. కొలువులు.. పై చదువులను అందిపుచ్చుకోలేని పరిస్థితులున్నాయి. కొందరు విద్యార్థులు విదేశీ చదువులు, ఫారిన్ స్కాలర్షిప్లను కోల్పోయిన ఉదంతాలున్నాయి. విదేశీ చదువులకు వీసా ప్రాసెసింగ్కు సర్టిఫికెట్లు తప్పనిసరి. అనేక విదేశీ వర్సిటీలు మెరిట్ స్కాలర్షిప్లిస్తున్నాయి. కొన్ని వర్సిటీలు మెమోలు, మార్కుల పర్సంటేజీ ఆధారంగానే స్కాలర్షిప్లిస్తాయి. వీటిని విద్యార్థులు దూరం చేసుకోవాల్సి వస్తున్నది. విదేశీ విద్యారుణాలు పొందిన వారు.. దీనికి తోడు మళ్లీ అదనంగా అప్పులు చేయాల్సి వస్తున్నది. ఎడ్యుకేషన్ లోన్ల కోసం అపసోపాలు పడ్డ విద్యార్థులు సర్టిఫికెట్ల కోసం మళ్లీ అప్పులు చేసేందుకు సిద్ధపడుతున్నారు. కొలువులొచ్చిన వారు సర్టిఫికెట్లు లేకపోవడం, కొలువు చేజారనుండటంతో అప్పులు తెచ్చి కడుతున్నారు. లక్షల్లో ఫీజు బకాయిలుండటం.. ఫీజులు కడితేనే సర్టిఫికెట్లు చేతికందే పరిస్థితి ఉండటంతో విద్యార్థుల్లో ఆ ఆనందం కనిపించడంలేదు. ఇక పై చదువులు, ఉన్నత చదువుల కోసం కూడా సర్టిఫికెట్లు కావాల్సి ఉండటంతో విద్యార్థులకు పోరాటం తప్పడంలేదు.
విద్యార్థులు ఒక వేళ ఫీజులు కడుతామ న్నా.. కట్టలేనంత ఫీజులున్నాయి. మూడు, నాలుగేండ్ల ఫీజును కట్టాలంటే విద్యార్థులు వణికిపోతున్నారు. రాష్ట్రంలో 33-40 వరకు కాలేజీల్లో బీటెక్ ఫీజు లక్ష దాటింది. నాలుగేండ్లకు ఈ కాలేజీల్లోని విద్యార్థులు నాలుగులక్షలపైగా ఫీజు కట్టాల్సిందే. బీ ఫార్మసీ ఫీజులు కూడా లక్షల్లో ఉన్నాయి. వీటిని కట్టాలంటే విద్యార్థులు అప్పులు చేయాల్సిందే. గండిపేటలోని ఓ కాలేజీలో ఫీజు రూ.1.60లక్షలుంది. మరో కాలేజీ ఫీజు 1.40లక్షలుంది. ఈ కాలేజీల్లోని విద్యార్థులు రూ. 6లక్షలు కట్టాల్సిన పరిస్థితులున్నాయి. ఇంత మొత్తం ఎక్కడి నుంచి తెచ్చేది.. ? ఎలా కట్టేది.. ? అన్న టెన్షన్తో విద్యార్థులు కుమిలిపోతున్నారు.
రంగారెడ్డి జిల్లా తుర్కయాంజాల్లోని న్యూ చైతన్య కాలేజీలో విద్యార్థులు డీఆర్డీఏ ద్వారా ఉచిత ప్రవేశాలు పొందారు. ఇంటర్ చదువులు పూర్తయ్యాక సదరు కాలేజీ యాజమాన్యం సర్టిఫికెట్లు ఇవ్వడంలేదు. ఫీజులు కడితేనే ఇస్తామంటూ చెప్పింది. ఎప్సెట్ కౌన్సెలింగ్కు హాజరుకావాల్సిన విద్యార్థులకు సర్టిఫికెట్లు చేతికందలేదు. సర్టిఫికెట్లు ఇవ్వకపోవడం.. కౌన్సెలింగ్కు హాజరయ్యే అవకాశం చేజారడంతో విద్యార్థుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకున్నది. కాలేజీ యాజమాన్యం దిగి రాకపోవడంతో విద్యార్థులు కాలేజీకి తాళా లు వేసి రోడ్డుపై బైఠాయించారు.