హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో జర్నలిస్టులు పోషించిన పాత్ర అత్యంత కీలకమైనదని, చారిత్రాత్మకమైనదని పలువురు సీనియర్ జర్నలిస్టులు అభిప్రాయపడ్డారు. తెలంగాణ జర్నలిస్టు ఫోరం ఆవిర్భవించి ఇరవై ఏళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహించిన జూమ్ మీటింగ్లో టీఎస్పీఎస్సీ మాజీ చైర్మన్ ఘంటా చక్రపాణి, మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, ఆంధ్రజ్యోతి సంపాదకులు కె.శ్రీనివాస్ పాల్గొన్నారు. ఉద్యమంలో తెలంగాణ జర్నలిస్టులు పోషించిన పాత్రను వివరిస్తూ ఈ సందర్భంగా వారు కొనియాడారు.
2001 మే 31న తెలంగాణ జర్నలిస్టు ఫోరం ఆవిర్భవించింది. 2021 మే 31కి సరిగ్గా ఇరవై సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ సమావేశంలో ఆంధ్రజ్యోతి సంపాదకులు కె.శ్రీనివాస్ మాట్లాడుతూ ఉద్యమ తొలి రోజుల్లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కోసం జర్నలిస్టులు చేసిన సాహసం మరువలేనిదన్నారు. ఈ ఇరవై ఏళ్ల ప్రయాణంలో టీజేఎఫ్ రాష్ట్ర సాధన కోసం చేసిన పోరాటాలు, పార్టీలను, నాయకులను, సంస్థలను, సంఘాలను సమన్వయం చేసిన తీరును అన్నింటిని రికార్డు చేసి ఒక పుస్తక రూపంలో, డాక్యుమెంటరీ రూపంలో తీసుకు రావాల్సిన అవసరం ఉందన్నారు.
ఘంటా చక్రపాణి మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమ సమయంలో అప్పటి ప్రభుత్వాలు సభలు, సమావేశాల నిర్వహణకు అనుమతులు ఇవ్వనప్పుడు జర్నలిస్టులే ముందుండి సమావేశాలు, సభలను నడిపించారన్నారు. మారుమూల ప్రాంతాల్లో కూడా తెలంగాణ సభల నిర్వహణకు గ్రామీణ ప్రాంత జర్నలిస్టులు పోషించిన పాత్ర అమోగం అని కొనియాడారు. విభిన్న రాజకీయ అభిప్రాయాలు ఉన్న నేతలను ఒకే వేదిక మీదకు తెచ్చి వారితో తెలంగాణ అనిపించిన ఘనత టీజేఎఫ్ ది అని ఆయన అన్నారు.
మీడియా అకాడమీ చైర్మన్, టీయుడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు అల్లం నారాయణ మాట్లాడుతూ.. గుప్పెడు మందితో ప్రారంభమైన తెలంగాణ జర్నలిస్టు ఫోరం వందలు, వేలుగా విస్తరించి తెలంగాణ రాష్ట్ర సాధనలో అడుగడుగునా తన పాత్రను పోషించిందన్నారు. రోడ్ల మీదికి వచ్చి ప్రత్యక్ష ఉద్యమాలు చేసిన ఘనత తెలంగాణ జర్నలిస్టు ఫోరంది అన్నారు. ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద తెలంగాణ కోసం టీజేఎఫ్ ధర్నా, కలం కవాతు, ఛలో అసెంబ్లీ, సాగరహారం, సకలజనుల సమ్మె వంటి ఎన్నో చారిత్రక సందర్భాల్లో కదం, కదం కలిపి నడిచిన సంస్థ టీజేఎఫ్ అన్నారు.
సమావేశానికి అధ్యక్షత వహించిన టీయుడబ్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుతీ సాగర్ మాట్లాడుతూ.. రాష్ట్ర సాధన కోసం పోరాడిన టీజేఎఫ్ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత టీయుడబ్ల్యూజేగా జర్నలిస్టుల సంక్షేమం కోసం పనిచేస్తుందన్నారు. ఈ జూమ్ మీటింగ్లో వ్యవస్థాపక సభ్యులు కందుకూరి రమేష్ బాబు, రమణ కుమార్, రాజేష్ లతో పాటు తేంజు అధ్యక్షులు ఇస్మాయిల్, సీనియర్ నాయకులు ఎం.వి.రమణ, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల టీజేఎఫ్-టీయుడబ్ల్యూజే నాయకులు పాల్గొని వారి విలువైన సూచనలు, సలహాలు ఇచ్చారు. ఈ ఇరవై ఏళ్ల పోరాటాన్ని పుస్తక రూపంలో తీసుకురావాలని సమావేశం నిర్ణయించింది.