ధాన్యం కొనాల్సిన బాధ్యత కేంద్రానిదే
ఎగుమతి చాన్స్ ఉన్నా ఎందుకు కొనరు
రైతు స్వరాజ్య వేదిక చర్చలో నిపుణులు
హైదరాబాద్, డిసెంబర్ 14 (నమస్తే తెలంగాణ): మద్దతు ధరతోపాటు మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తే వరి సాగు నుంచి ఇతర పంటలకు మారేందుకు రైతులు ధైర్యంగా ముందుకొస్తారని వ్యవసాయ నిపుణులు, శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. ఉన్నట్టుండి వరి సాగు వద్దనడం సరికాదని తెలిపారు. ఒక్క సీజన్లో పంటల మార్పిడి సాధ్యం కాదని స్పష్టంచేశారు. ‘యాసంగిలో ఇతర పంటల సాగు.. సమస్యలు, పరిష్కారాలు’ అనే అంశంపై రైతు స్వరాజ్య వేదిక మంగళవారం బేగంపేటలోని సెస్లో వ్యవసాయ నిపుణులు, శాస్త్రవేత్తలతో చర్చా కార్యక్రమం నిర్వహించింది. ఈ సందర్భంగా ఏఐకేఎస్ ఉపాధ్యక్షుడు సారంపల్లి మల్లారెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం దేశంలో ఉత్పత్తి అవుతున్న బియ్యంలో మన అవసరాలు తీరగా 20-30 లక్షల టన్నులు మాత్రమే మిగులుతున్నాయని చెప్పారు. ఇంత పెద్ద దేశంలో ఈ కాస్త బియ్యమే ఎక్కువ అయ్యాయా? అని కేంద్రప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ధాన్యం కొనాల్సిన బాధ్యత పూర్తిగా కేంద్ర ప్రభుత్వానిదేనని స్పష్టంచేశారు. 30 లక్షల టన్నుల బాయిల్డ్ రైస్ ఎగుమతులకు అవకాశం ఉన్నప్పటికీ కేంద్రం ఎందుకు సేకరించటంలేదని ప్రశ్నించారు. దేశంలో బియ్యం నిల్వలు ఎక్కువగా ఉన్నాయంటున్న కేంద్రం, పేదలకు ఎందుకు పంచడం లేదని నిలదీశారు. దేశంలో ఇంకా 28 కోట్ల మంది దారిద్య్రరేఖకు దిగువనే ఉన్నారని, ఆకలి చావులు కొనసాగుతూనే ఉన్నాయని ఆవేదన వ్యక్తంచేశారు.
చిరు ధాన్యాలు మేలు
ఇతర పంటల సాగులో ఎక్కువగా చిరు ధాన్యాల సాగును ప్రోత్సహించాలని చర్చలో పాల్గొన్న నిపుణులు సూచించారు. వీటివల్ల రైతుకు లాభం రావడంతోపాటు ప్రజలకు పౌష్టికాహారం లభిస్తుందని తెలిపారు. చిరుధాన్యాలకు కూడా కేంద్రం మద్దతు ధర ప్రకటించినప్పుడే రైతుల్లో భరోసా పెరుగుతుందని పేర్కొన్నారు. రాష్ట్రమంతటా ఒకే రకమైన పంటలను పండించడం వల్ల కూడా ఇబ్బందులు ఎదురవుతాయని, ఏ పంటలు ఏ ప్రాంతాలకు అనుకూలమో గుర్తించి ప్రోత్సహించాలని సూచించారు. భవిష్యత్ మొత్తం కూరగాయలు, పండ్ల సాగుదేనని, రైతులు ఆ దిశగా ఆలోచించాలని కోరారు. కార్యక్రమంలో రైతు స్వరాజ్య వేదిక నేతలు కన్నెగంటి రవి, రాజిరెడ్డి, జలపతిరావు తదితరులు పాల్గొన్నారు.