కామారెడ్డి : షేర్ మార్కెట్లో ట్రేడింగ్ చేసి డబ్బులు డబుల్ చేస్తానని పలువురు ఇన్వెస్టర్ల వద్ద కోటి రూపాయల వరకు వసూలు చేసి, ట్రేడింగ్లో నష్టపోయిన యువకుడు ముంబైకి పారిపోయాడు. కాగా, అతని ఇద్దరు రూమ్ మేట్స్ను ముగ్గురు వ్యక్తులు మూడు రోజుల క్రితం హైదరాబాద్లోని అత్తాపూర్లో కిడ్నాప్ చేశారు. తన మిత్రుడి ఆచూకీ చెప్పాలని చిత్రహింసలకు గురి చేశారు.
చివరకు ఆదివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సిరిసిల్ల రోడ్డు సమీపంలో దాబా వద్ద కిడ్నాప్ చేసిన యువకులను వదిలివేసి వెళ్లిపోయారు. వెంటనే ఆ యువకులు కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన లుక్మాన్ అనే యువకుడు హైదరాబాద్లోని అత్తాపూర్లో నివాసం ఉంటూ ప్రైవేట్ జాబ్ చేస్తున్నాడు. అలాగే లుక్మాన్ తో మరో ఇద్దరు స్నేహితులైన కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన సయ్యద్ జావిద్, సుమేర్ సైతం ఒకే రూమ్ లో ఉంటూ ప్రైవేట్ జాబ్ చేస్తున్నారు.
లుక్మాన్ గత నెల 20వ తేదీన ట్రేడింగ్ పేరుతో కొంతమంది వద్ద డబ్బులు వసూలు చేసి పారిపోయాడు. గత నెల 25వ తేదీన లుక్మాన్ జావిద్ కు ఫోన్ చేసి ముంబైలో ఉన్నట్లు తెలిపాడు. ఈ విషయాన్ని సయ్యద్ జావిద్ గుడిమల్కాపూర్ పోలీస్ లకు సమాచారం ఇచ్చాడు. విషయం తెలుసుకున్న కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన అవేజు, అమీర్, షా నవాజు హైదరాబాద్లో ఉంటున్న సయ్యద్ జావిద్ తో పాటు మరో స్నేహితుడైన సుమేర్ను శుక్రవారం సాయంత్రం కిడ్నాప్ చేసి కామారెడ్డికి తీసుకువచ్చారు.
లుక్మాన్ ఎక్కడ ఉన్నాడనే విషయాన్ని మాకు చెప్పకుండా పోలీసులకు, అతని తండ్రికి ఎందుకు చెప్పారంటూ సయ్యద్ జావిద్, సుమేర్లను తీవ్రంగా చితకబాదారు. జిల్లాలోని బిక్కనూరు మండలం పొందుర్తి గ్రామ శివారులోని ఓ ఫామ్ హౌస్ రెండు రోజులపాటు ఓ దాబా వద్ద వదిలేసి పారిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.