PMGSY | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, జూలై 2 (నమస్తే తెలంగాణ): గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు నిర్మించేందుకు ఆర్భాటంగా ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన (పీఎంజీఎస్వై) పథకం కింద నిర్ధారించిన లక్ష్యం ప్రకారం రోడ్లు నిర్మించడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. గత ఆర్థిక సంవత్సరం (2022 ఏప్రిల్-డిసెంబర్)లో నిర్ధారిత లక్ష్యాల ప్రకారం 20 శాతం కూడా రోడ్లు వేయని రాష్ర్టాల జాబితాలో అండమాన్-నికోబార్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, కేరళ, ఝార్ఖండ్, నాగాలాండ్, ఛత్తీస్గఢ్ ఉన్నాయి.
ఈ పథకం కింద నిరుడు 47,171 కిలో మీటర్ల మేర రోడ్లు నిర్మించాల్సి ఉండగా 29,753 కి.మీ మాత్రమే వేశారు. లక్ష్య సాధనలో ఇది కేవలం 63 శాతమే కావడం గమనార్హం. మంజూరైన రోడ్లలో లక్ష్యాలను పూర్తి చేయని రాష్ర్టాల జాబితాలో బీజేపీ పాలిత గుజరాత్, మధ్యప్రదేశ్తో పాటు అస్సాం, ఉత్తరాఖండ్, హర్యానా సహా 24 రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాలున్నాయి.