హైదరాబాద్, నవంబర్ 11 (నమస్తే తెలంగాణ): విద్యుత్తు అధికారులు సకాలంలో గమనించడంతో ఔటర్ రింగ్ రోడ్డు(ఓఆర్ఆర్)పై పెద్ద ప్రమాదమే తప్పింది. గుర్తు తెలియని దుండగులు హైటెన్షన్ తీగెలతో కూడిన టవర్లకు ఉండే బోల్టులను తొలగించారు. ఆ టవర్లు కుప్పకూలి, హై టెన్షన్ వైర్లు ఓఆర్ఆర్పై పడి ఉంటే..? ఆ పరిస్థితిని ఊహించుకుంటేనే ఒళ్లు జలదరిస్తుంది. వివరాల్లోకి వెళ్తే.. మేడ్చల్కు సమీపంలోని కండ్లకోయ వద్ద ఓఆర్ఆర్పై నుంచి 220 కేవీ, 132 కేవీ లైన్లు దాటుతున్నాయి. ఇందుకోసం ఇరువైపులా టవర్లు ఉన్నాయి. అయితే ఆ టవర్లు ఉన్న భూమి (సర్వే నంబర్లు 33, 43, 52, 53, 36, 26) తమదని, తమను సంప్రదించకుండా టవర్లు వేశారని, వెంటనే తమకు నష్టపరిహారం చెల్లించాలంటూ ఈ నెల 9న ట్రాన్స్కో, జెన్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్రావుకు లీగల్ నోటీసును ఈ-మెయిల్ ద్వారా కొందరు పంపించారు.
దీనిపై క్షేత్రస్థాయి పరిశీలన చేయాలని సీఎండీ అధికారులను ఆదేశించారు. దీనితో ట్రాన్స్కో డైరెక్టర్ జగత్రెడ్డి, ఇతర అధికారులు అక్కడికి వెళ్లి టవర్లను పరిశీలించారు. అక్కడి పరిస్థితిని చూసిన వెంటనే వారికి ముచ్చెమటలు పట్టాయి. 220 కేవీ, 132 కేవీ లైన్లు ఉన్న రెండు టవర్లకు సంబంధించిన బోల్టులను ఎవరో దుండగులు విప్పేశారు. ఒక్కో టవర్కు నాలుగు కాళ్లు ఉంటాయి. ఇందులో మూడేసి కాళ్లకు ఉన్న బోల్టులను దుండగులు విప్పేశారు. ఏమాత్రం గాలి వీచినా.. ఆ టవర్లు పడిపోవడం ఖాయం.అందులో ఒక టవర్ పక్కకు ఒరిగినట్టుగా అధికారులు గుర్తించారు. ఆ టవర్లు కింద పడి.. హైటెన్షన్ వైర్లు ఓఆర్ఆర్పై పడితే..? ఈ ఊహే అధికారులను కలవరపెట్టింది.
వెంటనే పరిస్థితిని సీఎండీకి వివరించి, విద్యుత్తు సరఫరాను నిలిపివేశారు. టవర్లు పడిపోకుండా తాత్కాలిక రిపేర్లు చేపట్టారు. ఇదంతా పూర్తయ్యేసరికి అర్ధరాత్రి అయ్యింది. అప్పటివరకు అధికారులు, సిబ్బంది బిక్కు బిక్కు మంటూ గడిపారంటే.. ఎంతటి ప్రమాదం తప్పిందో ఊహించుకోవచ్చు. హైటెన్షన్ వైర్లు ఒకవేళ ఓఆర్ఆర్పై అడ్డంగా పడిపోయి ఉంటే.. ప్రజలకు, వాహనాలకు తీవ్ర నష్టం జరిగేది. వైర్లు తగిలిన వెంటనే వాహనాలు కాలిపోయేవి. వేగంగా వెళ్తున్న వాహనాలు ఒకటికొకటి ఢీకొట్టుకొనేవి. అలాంటి ప్రమాదమే జరిగితే ప్రాణ, ధన నష్టం తీవ్రంగాఉండేది.
దుండగులపై క్రిమినల్ కేసులు నమోదు
విద్యుత్తుశాఖ అధికారుల ఫిర్యాదు మేరకు ఈ దుశ్చర్యకు పాల్పడిన గుర్తు తెలియని దుండగులపై పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఇలాంటి హైటెన్షన్ టవర్ల బోల్టులు తీసివేయడంతో జరిగే ప్రమాదం.. టెర్రరిస్టు చర్య లాంటిదేనని, దీనిని గుర్తించడంలో ఏమాత్రం ఆలస్యమైనా పెను ప్రమాదానికి దారితీసేదని ట్రాన్స్కోలోని ఒక అధికారి ఆందోళన వ్యక్తంచేశారు. పెను ప్రమాదాన్ని నివారించిన ట్రాన్స్కో అధికారులు, సిబ్బందిని సీఎండీ దేవులపల్లి ప్రభాకర్రావు అభినందించారు. పూర్తిస్థాయి మరమ్మత్తుకు ఆదేశించారు. దుండగులను గుర్తించి, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు వర్గాలను కోరారు.