హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 9 (నమస్తే తెలంగాణ): మాటలతో మాయచేసి భారత మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీకి కూడా టోకరా పెట్టాడు చందూరి వెంకట కోటి సాయికుమార్. తెలుగు అకాడమీ రూ.64.5 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్ కుంభకోణంలో ప్రధాన సూత్రధారి అయిన సాయికుమార్ గతంలో గంగూలీని కూడా వివాదంలోకి లాగాడు. బ్యాంకు కార్డులతోపాటు పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ ఇలా అన్ని ప్లాస్టిక్ కార్డులను ఒకే కార్డు కిందకు మార్చి దానిద్వారా సేవలను వేగంగా పొందే అవకాశం ఉంటుందని సాయికుమార్ 2012లో ‘వన్ నేషన్ వన్ కార్డు’ కార్యక్రమాన్ని చేపట్టాడు. మాయ మాటలతో నమ్మించి తన కార్యక్రమానికి గంగూలీ ద్వారా వివిధ మాధ్యమాల్లో విస్తృత ప్రచారం నిర్వహించాడు. ఇందుకు గంగూలీకి రూ.కోటి చెల్లించినట్టు సాయికుమార్ ఇచ్చిన వాంగ్మూలం అప్పట్లో సంచలనమే సృష్టించింది. కార్డు ప్రాథమిక ప్రారంభ వేడుకను ఓ ఫైవ్స్టార్ హోటల్లో ఆర్భాటంగా జరిపాడు. అక్కడ సినీ ప్రముఖులతో ఆర్కెస్ట్రా నిర్వహించి హంగామా చేశాడు. ఈ కాన్సెప్ట్ విజయవంతం అవుతుందని, అదే ఏడాది నవంబర్లో అధికారికంగా ప్రారంభిస్తానని ప్రముఖులను నమ్మించాడు. అది ప్రారంభం కాకముందే ఆంధ్రప్రదేశ్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి రూ.55.47 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్ల స్కాం వెలుగులోకి వచ్చింది. దీన్ని అప్పట్లో సీఐడీ దర్యాప్తు చేసింది. వివిధ ప్రభుత్వశాఖలు, ప్రభుత్వ రంగసంస్థలకు సంబంధించి దాదాపు రూ.510 కోట్ల వరకు డిపాజిట్లను కొల్లగొట్టినట్టు విచారణలో సాయికుమార్.. అధికారులకు వాంగ్మూలం ఇవ్వడం కలకలం రేపింది. ప్రస్తుతం తెలుగు అకాడమీ ఫిక్స్డ్ డిపాజిట్ కుంభకోణంలో సాయికుమార్ దొరకడంతో పాత మోసాలన్నీ మళ్లీ వెలుగుచూశాయి. ఇప్పటివరకు బయటపడ్డ ఫిక్స్డ్ డిపాజిట్ స్కాంలలో సాయికుమార్ మాస్టర్మైండ్గా తేలింది. అందరికీ భారీ కమీషన్లను ఎర వేసి ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగసంస్థల ఫిక్స్డ్ డిపాజిట్లను కొల్లగొట్టడంలో ఇతడు దిట్ట. దీనికోసం దేశవ్యాప్తంగా ఏజెంట్లతోపాటు బ్యాంకు అధికారులను మచ్చిక చేసుకునేవాడు. వారికి నజరానాలు, దావత్లు ఇచ్చేవాడు. వారి సాయంతో ఫిక్స్డ్ డిపాజిట్లను దారి మళ్లించేవాడు. ఆ డబ్బుతో వ్యాపారాలు చేస్తూ.. విలాసాలను అనుభవిస్తాడని తేలింది. సాయికుమార్ గతంలో రెండు సీబీఐ, ఓ సీఐడీ కేసులో అరెస్టయ్యాడు. మరోవైపు, తెలుగు అకాడమీ నిధుల కుంభకోణంలో సాయికుమార్కు నకిలీ ఫిక్స్డ్ డిపాజిట్లను తయారుచేసి ఇచ్చిన పద్మనాభన్ను గురువారం కోయంబత్తూర్లో అరెస్టు చేసినట్టు సమాచారం. ఈ వ్యవహారంలో ఇప్పటివరకు 11 మంది అరెస్టయ్యారు.
14కు చేరిన నిందితుల సంఖ్య
ఈడీ విచారణ ప్రారంభం
హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 9 (నమస్తే తెలంగాణ): తెలుగు అకాడమీలో 64 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్ల కుంభకోణం కేసులో శనివారం మరో ముగ్గురిని హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. అరస్టైయిన వారిలో సురభి వినయ్, భూపతి రావు, పువ్వాడ వెంకటరమణ ఉన్నట్టు కేసు దర్యాప్తు చేస్తున్న ఏసీపీ మనోజ్ తెలిపారు. దీంతో ఈ కేసులో అరెస్టుల సంఖ్య 14కు చేరింది. సురభి వినయ్ ఈ కుంభకోణంలో కీలక సూత్రధారి సాయికుమార్కు పీఏగా వ్యవహరించాడని, డ్రా చేసిన నగదును అతని ద్వారానే విజయవాడకు తరలించినట్టు సమాచారం. భూపతిరావు, వెంకటరమణ కూడా కీలక సూత్రధారులకు సహకరించి కమిషన్లు పొందారని గుర్తించారు. మరికొన్ని అరెస్టులు ఉంటాయని పోలీసు వర్గాలు తెలిపాయి. ఈ కేసులో ఇది వరకు అరెస్టయిన 9 మంది నిందితులను శుక్ర, శని వారాల్లో పోలీసులు కోర్టు అనుమతి ద్వారా కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ కుంభకోణంలో నిధుల మళ్ళింపులకు సంబంధించి మనిలాండరింగ్ జరిగినట్టు అనుమానాలు ఉండడంతో ఈడీ అధికారులు కూడా దృష్టి పెట్టారు. సీసీఎస్ పోలీసులు నమోదు చేసిన కేసు వివరాలు, పత్రాలను తీసుకున్నట్టు తెలిసింది.