హైదరాబాద్, సెప్టెంబర్ 19 (నమస్తే తెలంగాణ): స్వాతంత్య్రం సిద్ధించిన 75 ఏండ్లలో దేశవ్యాప్తంగా పెరిగిన సాగువిస్తీర్ణం కేవలం 6.7 శాతం కాగా.. తెలంగాణ రాష్ట్రం మాత్రం ఏడేండ్లలోనే 76.92 శాతం వృద్ధిని నమోదు చేసిం ది. దేశవ్యాప్తంగా అత్యధికంగా వ్యవసాయానికి సాగునీటి వసతి కలిగిన రాష్ర్టాల జాబితాలో తెలంగాణ టాప్-10లో నిలిచింది. దేశంలో సాగుకు యోగ్యమైన భూమిలో 40 శాతానికి మాత్రమే నికరమైన నీటివసతి ఉంది. ఇటీవల ముంబైకి చెందిన ఎన్జీవో ‘సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంట్ అండ్ అగ్రికల్చర్’ (సెంటెగ్రో) వెల్లడించిన గణాంకాలు ఇదే విషయాన్ని స్పష్టంచేస్తున్నాయి. 2014లో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ఇప్పటివరకు సాగునీటి ప్రాజెక్టులపై వెచ్చించిన మొత్తం అత్యల్పం కాగా, ఇరిగేషన్ సెక్టార్లో సాధించిన పురోగతి సైతం అంతంతమాత్రంగానే ఉన్నది.
దేశంలో 60 శాతం మేర వ్యవసాయం భూ గర్భ జలాలపై ఆధారపడి మాత్రమే కొనసా గుతున్నదని కేంద్రమే గత పార్లమెంట్ సమా వేశాల్లో వెల్లడించింది. దేశంలో మొత్తంగా సాగుకు యోగ్యమైన భూమి 18.08కోట్ల హెక్టార్లు ఉండగా, అందులో నికరంగా సాగవుతున్నది 15.38 కోట్ల హెక్టార్లు మాత్రమే. అదీగాక అందులోనూ 40 శాతం అంటే 7.155 కోట్ల హెక్టార్ల వ్యవసాయ భూమి మాత్రమే సాగునీటి వసతిని కలిగి ఉండడం శోచనీయం. మహారాష్ట్ర, జార్ఖండ్ సహా కొన్ని ప్రధాన రాష్ట్రాల్లో వ్యవసాయానికి యోగ్యమైన భూమిలో 20 శాతానికి కూడా నీటివసతి లేదంటే, సాగునీటి కల్పన విషయంలో కేంద్రం, ఆయా రాష్ట్ర ప్రభుత్వాల పనితీరుకు నిదర్శనం. 1950లో దేశంలో సాగు చేస్తున్న భూమి 13.10 కోట్ల హెక్టార్లు కాగా, 2021 నాటికి అది కేవలం 14 కోట్ల హెక్టార్లు మాత్రమే అయ్యింది. మొత్తంగా పెరిగింది కేవలం 90 లక్షల హెక్టార్లు మాత్రమే.
కేంద్రప్రభుత్వ గణాంకాల ప్రకారం దేశంలో 60 శాతం నికర నీటిపారుదల వ్యవస్థ కేవలం భూగర్భ జలాల ద్వారానే కొనసాగుతున్నది. ఢిల్లీ, హర్యానా, పంజాబ్, రాజస్థాన్లలో భూగర్భ జలాల వెలికితీతరేటు అత్యధికంగా ఉంది. సూక్ష్మ నీటిపారుదల కింద సాగు విస్తీర్ణాన్ని పెంచడం అత్యంత ప్రభావవంతమైన నీటి సంరక్షణ విధానమని ఆర్థిక సర్వేలు, ఇరిగేషన్ రంగ నిపుణులు దశాబ్దాలుగా సూచిస్తున్నారు. అదేవిధంగా మధ్యస్థ, దీర్ఘకాలిక భూగర్భ జలాల రీచార్జ్, పరిరక్షణ ప్రణాళికలపై ప్రభుత్వాలు దృష్టి సారించాల్సిన అవసరముందని నొక్కిచెబుతున్నారు. అయితే కేంద్రంలోని బీజేపీ సర్కారు ఆ దిశగా పటిష్టమైన చర్యలు తీసుకున్న దాఖలాల్లేవు.
నీరు రాష్ట్ర పరిధిలోని అంశం. స్థానిక ప్రభుత్వాలు తమ పరిధిలోని వర్షాధార ప్రాంతాల్లో సాగునీటిని అందించడానికి ప్రాజెక్టులను నిర్మించుకుంటాయి. అయితే కేంద్ర ప్రభుత్వం వాటికి సాంకేతిక సహకారం, కొన్ని సందర్భాల్లో పాక్షిక ఆర్థిక సహాయం అందిస్తుంది. మొత్తంగా మోదీ హయాంలో సాగునీటిరంగ అభివృద్ధికి కేంద్రం నుంచి రాష్ర్టాలకు అందిన సహకారం అంతంతమాత్రమే. కేంద్రంలో బీజేపీ అధికారం లోకి రాగానే 2015-16లో నీటిపారుదల వ్యవస్థ విస్తరణ, నీటిసంరక్షణే లక్ష్యంగా ప్రధానమంత్రి కృషి సించాయి యోజన (పీఎంకేఎస్వై) పథకాన్ని ప్రారంభించింది. అందుకు కేంద్రం అందించే నిధులన్నీ ప్రపంచబ్యాంకు రుణం ద్వారా సమకూర్చుకున్నవే. ఆ పనులైనా సవ్యంగా కొనసాగుతున్నాయా.. అంటే అదీ లేదు. పనులు నత్తనడకన సాగుతున్నాయి. దీంతో కేంద్రం ఇటీవల ఈ పథకాన్ని 2025-26 సంవత్సరం వరకు పొడిగించింది. అదీగాక ఈ పథకం కోసం మొత్తంగా 93,069 కోట్లు అవసరమవుతాయని అంచనా వేయగా.. అందులో కేంద్రం వాటా 37,454 కోట్లు, నాబార్డు రుణం రూ.20,435 కోట్లు కాగా రాష్ర్టాల వాటా రూ.35,180 కోట్లుగా ఉంది. ఏఐబీపీ తదితర పథకాల కోసం కేంద్రం కేటాయించిన నిధులు కూడా వరల్డ్బ్యాంకు రుణాల సాయంతో సమకూర్చుకున్నవే. అయినప్పటికీ బీజేపీ సర్కారు ప్రారంభించిన ఏ ఒక్క పథకమూ ఇంతవరకు లక్ష్యాన్ని చేరుకోలేదు.
సాగునీటిరంగ అభివృద్ధి, నీటి వనరుల సంరక్షణలో తెలంగాణ యావత్ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నది. ఒకవైపు మిషన్ కాకతీయ పథకం కింద ఇప్పటివరకు నాలుగుదశల్లో రూ.9,155 కోట్లతో 27,584 చెరువులను కేసీఆర్ ప్రభుత్వం పునరుద్ధరించింది. వాగుల పునరుజ్జీవం కింద 1,200 చెక్డ్యామ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. అందులో సగానికి పైగా పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. మరోవైపు ఎల్లంపల్లి, బీమా, కోయిల్సాగర్ తదితర పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడంతోపాటు, బృహత్తర కాళేశ్వరం ప్రాజెక్టును చేపట్టి మూడేండ్ల స్వల్పవ్యవధిలోనే పూర్తిచేసింది. తుమ్మిళ్ల లిఫ్ట్ను కేవలం పదినెలల రికార్డు వ్యవధిలోనే నిర్మించింది. మొత్తంగా సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సమగ్ర ప్రణాళికతో తెలంగాణ సాగునీటిరంగ ముఖచిత్రమే మారిపోయింది. తెలంగాణ రాష్ర్టావిర్భావం నాటికి వానకాలం, యాసంగి కలిపి మొత్తంగా కోటీ 30లక్షల ఎకరాల్లో పంటలు సాగవగా, ప్రస్తుతం అది ఏకంగా 2 కోట్ల 30 లక్షల ఎకరాలకు పెరిగింది. కేవలం ఏడున్నరేండ్ల కాలంలోనే 76.92శాతం వృద్ధిని రాష్ట్రం నమోదు చేయడం విశేషం. నీటి వనరుల సంరక్షణ, చెరువుల పరిరక్షణ అంశంలో ఇప్పుడు యావత్ దేశానికే తెలంగాణ దిక్సూచిగా మారింది.