హైదరాబాద్, మే 30 (నమస్తే తెలంగాణ): కరోనా నేపథ్యంలో ఆన్లైన్లోనే తరగతులు కొనసాగుతున్నా విద్యార్థులకు చెల్లించాల్సిన స్కాలర్షిప్స్(ఉపకార వేతనాలు) చెల్లింపు ఆగకూడదన్న పట్టుదలతో సర్కార్ బడుగు, బలహీనవర్గాల విద్యార్థులకు కోట్లాది రూపాయలు చెల్లిస్తూ అండగా నిలుస్తున్నది. తాజాగా 2021- 22 విద్యాసంవత్సరానికి తొలి త్రైమాసికంలో చెల్లించాల్సిన రూ.333 కోట్ల 40 లక్షల 76 వేల ఉపకారవేతనాలను విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. దీంతో వివిధ పథకాల కింద ఈ విద్యాసంవత్సరానికి మొత్తం రూ.458.38 కోట్లు చెల్లించి ఎటువంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా విద్యార్థులపై పెడుతున్న ఖర్చును ఆపబోమని స్పష్టంచేసింది. పోస్ట్మెట్రిక్ స్కాలర్షిప్స్, మహాత్మాజ్యోతిబా పూలే విద్యానిధి పథకం, నాన్ ప్రొఫెషనల్ కోర్సులకు సంబంధించి ఉపకార వేతనాలతోపాటు ఈబీసీ స్కాలర్షిప్లకు వివిధ పద్దుల ద్వారా ప్రభుత్వం విడుదలచేయటం విశేషం. ఒక్క బీసీ సంక్షేమశాఖ పరిధిలో నిర్వహించే విద్యా సంస్థలకే మెస్చార్జీలు, ఫీజు రీయింబర్స్మెంట్ కమ్ ట్యూషన్ ఫీజుతోపాటు మహాత్మాజ్యోతిబా పూలే విదేశీ విద్యానిధి పథకం కింద అందించే ప్రోత్సాహకాలను నిర్విరామంగా కొనసాగిస్తుండటం విశేషం.