హైదరాబాద్, సెప్టెంబర్ 20 (నమస్తే తెలంగాణ): రెరా నిబంధనలను ఉల్లంఘించిన ప్రాజెక్టులపై రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకుంటామని రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) చైర్మన్ డాక్టర్ ఎన్ సత్యనారాయణ హెచ్చరించారు. రెరా రిజిస్ట్రేషన్ లేకుండా ప్రకటనలు, మారెటింగ్తోపాటు నిర్మాణాలు చేపట్టిన రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులపై ఫిర్యాదులు అందితే పరిశీలించి చట్టం ప్రకారం చర్యలు చేపడతామని స్పష్టంచేశారు.
బుధవారం రాష్ట్ర మున్సిపల్ పరిపాలనాశాఖ కమిషనర్, డైరెక్టర్ పమేలా సత్పతి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు, మేనేజర్లు, ప్లానింగ్ అధికారులు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, రీజనల్ మున్సిపల్ అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రియల్ ఎస్టేట్దారులు, ప్రమోటర్లు రెరా రిజిస్ట్రేషన్ పొందకుండా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తూ, కొనుగోలుదారులను మభ పెట్టకుండా చూడాలని అదనపు కలెక్టర్లకు చైర్మన్ సూచించారు.
500 చదరపు మీటర్లు, 8 ప్లాట్లకు మించి నిర్మాణాలు చేపట్టడానికి రెరా రిజిస్ట్రేషన్ తప్పనిసరి అని వెల్లడించారు. డీటీసీపీ, హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ, ఇతర స్థానిక సంస్థల అనుమతి అనంతరం రెరా రిజిస్ట్రేషన్ పొందడంపై అవగాహన కల్పించాలని చెప్పారు. ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్ తదితర జిల్లాల అదనపు కలెక్టర్లతో మాట్లాడి రియల్ ఎస్టేట్ పరిస్థితులను చైర్మన్ అడిగి తెలుసుకున్నారు.