ఎనిమిదేండ్ల కాలం.. కనీవినీ ఎరుగని రీతిలో యుద్ధప్రాతిపదికన నిర్మాణవుతున్న ప్రాజెక్టులు.. మండుటెండల్లోనూ నిండుగా తడలు కొడుతున్న రిజర్వాయర్లు, చెరువులు, వాగులు వంకలు.. దరులను ఓర్సుకొని పారుతున్న కాలువలు.. కనుచూపు మేరలో పరుచుకుంటున్న పచ్చదనం.. ఏమిటీ అద్భుతం? ఏమిటీ ఈ విజయరహస్యం? ఏమిటీ సాంకేతికత పరిజ్ఞానం? అన్నింటికీ సమాధానం ఒక్కటే. సీఎం కేసీఆర్ సుదీర్ఘ మేధోమథనం. నెర్రెలిడ్సిన నేల కోసం రూపొందించిన ఆయన వ్యూహం. ప్రాజెక్టుల నిర్మాణం మొదలు.. వాటి నిర్వహణ వరకు అమలు చేస్తున్న విప్లవాత్మక నిర్ణయాల ఫలితం. నేడు నీళ్ల సారు విద్యాసాగర్రావు జయంతిని పురస్కరించుకొని నిర్వహిస్తున్న తెలంగాణ ఇరిగేషన్ డే సందర్భంగా ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక కథనం.
హైదరాబాద్, నవంబర్ 13 (నమస్తే తెలంగాణ): ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుతో తెలంగాణ సాగునీటి రంగంలో నవశకం ఆరంభమైంది. చరిత్రాత్మక ప్రగతిని సాధిస్తూ ముందుకు దూసుకుపోతున్నది. గుక్కెడు నీటి కోసం తండ్లాడిన నేల.. ఎనిమిదేండ్ల స్వల్ప కాలంలోనే బీళ్లలో పరవళ్లు తొక్కుతున్న జలాలను చూస్తూ పరవశించిపోతున్నది. నాడు పల్లేర్లు మొలిచిన నేల నేడు పసిడి పంటలకు ఆలవాలమైంది. ఇదంతా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు సర్కారు ప్రణాళికాబద్ధ కృషి ఫలితం. స్వాతంత్య్రం సిద్ధించిన అనంతరం 75 ఏండ్లలో దేశవ్యాప్తంగా పెరిగిన సాగు విస్తీర్ణం కేవలం 6.7 శాతం కాగా, ఎనిమిదేండ్లలోనే తెలంగాణలో 76.92 శాతం వృద్ధి నమోదవడం ఇందుకు నిదర్శనం. దేశవ్యాప్తంగా అత్యధికంగా సాగు నీటి వసతి కలిగిన టాప్ టెన్ రాష్ర్టాల్లో తెలంగాణ ఒకటిగా నిలవడం గర్వకారణం. ఇటీవల కేంద్రం వెల్లడించిన గణాంకాలే ఇవి. ప్రాజెక్టుల నిర్మాణం, నిర్వహణలో నూతన ఒరవడికి శ్రీకారం చుట్టడం వల్ల ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టడమేగాకుండా, అంతేస్థాయిలో సద్వినియోగం చేసుకుంటూ ఆదర్శంగా నిలుస్తున్నది.
అత్యాధునిక సాంకేతికత
పక్కా ప్రణాళిక, ఆధునిక సాంకేతికతను వినియోగించుకొని దేశంలో ఏ రాష్ట్రం నిర్మించనంత వేగంగా తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టులను గడువులోగా పూర్తిచేస్తున్నది. రోజుల వ్యవధిలోనే సర్వే, అనువైన ప్రాంతం ఎంపిక, డిజైన్ల తయారీ ప్రక్రియను పూర్తిచేస్తున్నది. సాగునీటి రంగంలోనూ లైడార్ సర్వే విధానాన్ని ప్రవేశపెట్టి, తొలిసారి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి వినియోగించింది. శాటిలైట్ మ్యాప్ల ద్వారానే కచ్చితమైన అంచనాలతో ప్రాజెక్టుల డిజైన్ను రూపొందిస్తున్నది. ప్రాజెక్టుల నిర్మాణంలో ముఖ్యమైన ఫౌండేషన్ నిర్మాణాన్ని తక్కువ ఖర్చు, తక్కువ సమయంలో చేసేందుకు అధునాతన టెక్నాలజీ కటాఫ్ టెక్నిక్ను వినియోగిస్తున్నది. పిల్లర్ల నిర్మాణంలో 5 మీటర్ల ఫ్రేమ్వర్క్ టెక్నాలజీకి బదులు 10 మీటర్ల ఫ్రేమ్ వర్క్ను వినియోగిస్తున్నారు. ఐవోటీ (ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్) టెక్నాలజీని కూడా వినియోగంలోకి తీసుకొచ్చింది. ప్రాజెక్టు గేట్ల తయారీలోనూ సీఎన్సీ (కంప్యూటర్ న్యూమరికల్ కంట్రోల్) విధానాన్ని ఉపయోగిస్తున్నది. ప్రాజెక్టుల పనులు, పురోగతి ఆన్లైన్ ద్వారా మానిటరింగ్ చేస్తున్నది. ప్రతి ప్రాజెక్టు సైట్ వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేసింది.
వాతావరణ విశ్లేషణకు ప్రత్యేక వ్యవస్థ
ప్రాజెక్టుల పరిధిలో రాబోయే వారం రోజుల్లో ఏ మేరకు వర్షపాతం పడనున్నది? ఎంత వరద వచ్చే అవకాశమున్నది? తదితర అంచనాలను రూపొందించుకునే వ్యవస్థను కూడా తెలంగాణ సొంతంగా అభివృద్ధి చేసుకున్నది. భారత వాతావరణ శాఖ, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ వారు అందించే వాతావరణ సమాచారాన్ని, భూగర్భ జలశాఖ ఇచ్చే సమాచారాన్ని అనుసంధానించి అంచనాలను వివరిస్తున్నది. ఇటీవల వరదలను కచ్చితత్వంతో అంచనా వేశారు. ఫలితంగా అవసరమైన సమయంలోనే పంపులను, మోటర్లను ఆన్ చేసే సౌలభ్యం కలగడంతోపాటు విద్యుత్తు ఖర్చులు ఆదా అవుతున్నాయి.
ఒకే గొడుగు కిందకు..
ప్రాజెక్టుల నిర్మాణం, నిర్వహణ కాకుండా సాగు నీటి శాఖ పరిపాలన విధానంలోనూ ముఖ్యమంత్రి కేసీఆర్ విప్లవాత్మక సంస్కరణలను ప్రవేశపెట్టారు. గతంలో మేజర్, మధ్యతరహా, మైనర్ రంగాలుగా ఇరిగేషన్ శాఖ విడివిడిగా ఉండేది. రాష్ట్ర ఏర్పాటు తరువాత వాటన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చారు. ఇరిగేషన్ విభాగాన్ని మొత్తం 19 టెరిటోరియల్స్గా విభజించి, ప్రాజెక్టుల బాధ్యతలను చీఫ్ ఇంజినీర్లకు అప్పగించారు. ప్రాజెక్టులు, పంప్లు, కాల్వలు, తూముల నిర్వహణ బాధ్యతల పర్యవేక్షణకు ప్రత్యేకంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో కొత్తగా ఆపరేషన్స్ అండ్ మెయింటనెన్స్ విభాగాన్ని నెలకొల్పారు. ఒక ఇంజినీర్ ఇన్ చీఫ్ పోస్ట్ను ఏర్పాటు చేశారు. ఈ విభాగానికి 879 పోస్టులను మంజూరు చేశారు. వీటికి తోడు 3 వేలకుపైగా లష్కర్ పోస్టులను కూడా మంజూరు చేశారు. డీఈల నుంచి సీఈల వరకు ఆర్థిక అధికారాలను కట్టబెట్టారు. ఫలితంగా కాలువలు, ప్రాజెక్టుల మరమ్మతు పనులు ఎప్పటికప్పుడు కిందిస్థాయిలోనూ పూర్తవుతున్నాయి.
సాగునీటి నిర్వహణకు సాఫ్ట్వేర్
లక్షల కోట్లు వెచ్చించి నిర్మిస్తున్న ప్రాజెక్టుల నిర్వహణలోనూ ప్రభుత్వం సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నది. సీఎం కేసీఆర్ మార్గదర్శకాలు, సంకల్పానికి అనుగుణంగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్వహణకు ప్రత్యేకమైన డిసిషన్ సపోర్టు సిస్టమ్పై (డీఎస్ఎస్) సాఫ్ట్వేర్ను, మొబైల్ యాప్లను రూపొందించింది. రిజర్వాయర్లు, పంప్హౌస్లు, కాలువల్లో నీటి ప్రవాహాలు, ఇన్ఫ్లోలు, ఔట్ఫ్లోలకు సంబంధించి రియల్ టైమ్ డాటా వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం అదే డీఎస్ఎస్ విధానాన్ని రాష్ట్రంలోని అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులకు విస్తరించాలని నిర్ణయించింది. చివరి ఆయకట్టుకు సాగు నీరందించేందుకు టెయిల్ టూ హెడ్ (చివరి నుంచి మొదటికి) పద్ధతికి శ్రీకారం చుట్టింది. దీని ప్రకారం ముందుగా చివరి ఆయకట్టుకు సాగు నీరందిస్తూ క్రమంగా ప్రాజెక్టు సమీపంలోని ఆయకట్టుకు నీరందిస్తారు.
డిజిటలైజేషన్
ప్రతీ ప్రాజెక్టుకు సంబంధించి డిజైన్, కాలువ నిర్మాణం తదితర అన్నింటితో కలిపి డిటైల్డ్ రిపోర్ట్లు, భారీ, అంతర్రాష్ట్ర ప్రాజెక్టులకు సంబంధించి అయితే వివిధ రాష్ర్టాలతో చేసుకున్న ఒప్పంద ప్రతాలు, ట్రిబ్యునల్స్ నీటి కేటాయింపులు, ముఖ్యమైన జీవోలు తదితర కీలక పత్రాలు ఉంటాయి. ఇలా లక్షల్లో ఉన్న పత్రాలను వెతకడం, భద్రపరచడం అతిపెద్ద సవాల్. ఈ నేపథ్యంలోనే తెలంగాణ సర్కారు సాగునీటి శాఖకు సంబంధించిన డాక్యుమెంట్లనన్నింటినీ డిజిటలైజ్ చేయించింది. సుమారు 5 లక్షల డాక్యుమెంట్లను, 2 వేల బ్లూప్రింట్లను డిజిటలైజ్ చేయించింది. ఏ పత్రమైనా ఒక్క క్లిక్తో అందుబాటులోకి వచ్చే వ్యవస్థను ఏర్పాటు చేసింది. టెరిటోరియల్ వారీగా స్థిర, చర ఆస్తుల లెక్కల జాబితాను, ఆయకట్టు లెక్కల డాటాబేస్ను సిద్ధం చేయడం విశేషం. ఇరిగేషన్ పరిపాలన విభాగానికి సంబంధించిన అన్నీ ఆన్లైన్ ద్వారానే కొనసాగుతున్నాయి. ఉద్యోగుల బదిలీలు, జాయినింగ్లు మొదలు, సర్క్యులర్స్ అన్నింటినీ నిర్వహిస్తుండటం విశేషం.