FICCI FLO | అన్ని రంగాల్లో దూసుకెళ్తున్న మహిళలను పారిశ్రామిక రంగంలోనూ ముందుకు తీసుకెళ్లాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఎల్ఓ) ఇండస్ట్రియల్ పార్క్ విజయవంతంగా నడుస్తున్నది. వివిధ రాష్ర్టాలతో పాటు విదేశాలకు కూడా ఇక్కడి ఉత్పత్తులు ఎగుమతి అవుతున్నాయి. దేశంలో ఎక్కడా లేని విధంగా మహిళలే పరిశ్రమలు నిర్వహించేలా ఈ పార్క్ను తీర్చిదిద్దారు. సుమారు 25 మంది మహిళా పారిశ్రామికవేత్తలు కంపెనీలు ఏర్పాటు చేసి వివిధ వస్తువులను ఉత్పత్తి చేస్తున్నారు.
సంగారెడ్డి జిల్లా సుల్తాన్పూర్లో ప్రభుత్వం 2017లో సుమారు 50ఎకరాల్లో ఎఫ్ఎల్ఓ గ్రీన్ ఇండస్ట్రీస్ పార్క్ను ఏర్పాటు చేసింది. గతేడాది మహిళా దినోత్సవం సందర్భంగా మార్చిలో మంత్రి కేటీఆర్ ఈ ఇండస్ట్రియల్ పార్క్ను ప్రారంభించారు. ఇందులో మహిళా పారిశ్రామికవేత్తలు 25 తయారీ యూనిట్లను నెలకొల్పారు. 100 శాతం మహిళా పారిశ్రామికవేత్తలే వీటిని నిర్వహిస్తున్నారు. ఎలక్ట్రానిక్స్, ప్యాకేజింగ్, ఫర్నిచర్, జనరల్ ఇంజినీరింగ్, ఫుడ్ ప్రాసెసింగ్, మెడికల్ డివైజెస్, జ్యువెలరీ, న్యూట్రాస్యూటికల్స్, ఆటో పార్ట్స్, కెపాసిటర్స్, ప్రీకాస్ట్ బ్లాక్స్, మల్టీ లెవల్ పార్కింగ్ ఎలివేటర్స్, లిఫ్టులు, గార్మెంట్స్, ఎలక్ట్రిక్ ఫ్యాన్లు, ఎల్ఈడీ లైట్లు తదితర వస్తువులు ఇక్కడ ఉత్పత్తి అవుతున్నాయి. రూ. 250 -300 కోట్ల వరకు పెట్టుబడులు రాగా, 2,000 మంది ఉపాధి పొందుతున్నారు. ఉద్యోగుల్లో సైతం 60 శాతానికిపైగా మహిళలే ఉండటం విశేషం.
మహిళలకు చేయూత..
బడుగు, బలహీన వర్గాలు, మహిళలను పారిశ్రామికవేత్తలుగా ప్రోత్సహించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఈ క్రమంలోనే ఔత్సాహిక పారిశ్రామికవేత్తల కోరిక మేరకు ప్రత్యేకంగా 50 ఎకరాల్లో ఇండస్ట్రియల్ పార్క్ను అభివృద్ధి చేసింది. దేశంలో మహిళల కోసం ఏర్పాటు చేసిన మొదటి ఇండస్ట్రియల్ పార్క్ ఇదే కావడం విశేషం. ఇతర రాష్ర్టాల్లోని పారిశ్రామికవాడల్లో మహిళలకు భూములు కేటాయిస్తున్నప్పటికీ ప్రత్యేకంగా మహిళల కోసమే పారిశ్రామికవాడలు ఏర్పాటు చేసిన దాఖలాలు లేవు.
మరో 100 ఎకరాలకు ఆమోదం..
మహిళలకు 50% ధరలకే భూములు ఇవ్వడంతో పాటు వివిధ పథకాల కింద ప్రోత్సాహకాలు కూడా ప్రభు త్వం అందించింది. ఇండస్ట్రియల్ పార్కులో 34 ప్లాట్లను ఏర్పాటు చేసి భూములను కేటాయించగా, ప్రస్తుతం 25 పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. రెండోదశ ఎఫ్ఎల్ఓ ఇండస్ట్రియల్ పార్క్ కోసం ప్రభుత్వం వద్ద ప్రతిపాదన ఉన్నది. ఇదివరకే మరో 100 ఎకరాల స్థలాన్ని కేటాయించాలని మహిళా ప్రతినిధులు కోరగా, మంత్రి కేటీఆర్ ఆమోదం తెలిపారు. త్వరలోనే రెండోదశ మహిళా పారిశ్రామిక పార్క్ కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నది.
ఎగుమతి అవుతున్న ఉత్పత్తులు ఇవే..
మహిళా పారిశ్రామికవాడ నుంచి దేశ, విదేశాలకు వివిధ రకాల ఉత్పత్తులు ఎగుమతి అవుతున్నాయి. ముఖ్యంగా ప్యాకేజింగ్, ఎల్ఈడీ లైట్లు, మెడికల్ డివైజెస్, జ్యువెలరీ, ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులు ఎక్కువగా కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర తదితర రాష్ర్టాలకు ఎగుమతి అవుతున్నాయి. పోల్మన్ టెంపరేచర్ ఇండికేటర్స్, మెటర్ పౌడర్, క్రాంప్టన్ ఫ్యాన్లు, డ్యూక్ బిస్కెట్లు జర్మనీ, దక్షిణ కొరియా తదితర దేశాలకు ఎగుమతి అవుతున్నాయి.
ప్రభుత్వ సహకారం మరువలేనిది
దేశంలో ఎక్కడా లేని విధంగా మహిళల కోసం ప్రత్యేకంగా పారిశ్రామికవాడను ఏర్పాటు చేయడం హర్షణీయం. ప్రోత్సాహకాలను ఇస్తూ మహిళలకు ప్రభుత్వం అందిస్తున్న సహకారం మరువలేనిది. సుల్తాన్పూర్లోని మహిళా పారిశ్రామికవాడలో పరిశ్రమల నిర్వాహకులంతా మహిళలే. పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్నారు.
-సుజిత, కోశాధికారి, ఫిక్కీ, ఎఫ్ఎల్ఓ
…? కిశోర్ శుక్లా