హైదరాబాద్, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ): ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో బీఎస్సీ కోర్సుల ప్రవేశాలకు నిర్వహించే కౌన్సెలింగ్లో ఉద్యాన బీఎస్సీ కోర్సుకు ఎలాంటి కౌన్సెలింగ్ నిర్వహించవద్దని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. వ్యవసాయ, మార్కెటింగ్శాఖ కార్యదర్శి సురేంద్రమోహన్ బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. దీంతో గురువారం నుంచి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలో కేవలం అగ్రికల్చర్ బీఎస్సీ కోర్సులకు మాత్రమే కౌన్సెలింగ్ నిర్వహించనున్న ట్టు వర్సిటీ వీసీ డాక్టర్ అల్దాస్ జానయ్య తెలిపారు. 10వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయని, మూడు రోజులపాటు జరిగే కౌన్సెలింగ్లో 6వేల సీట్లు భర్తీ చేస్తామని చెప్పారు.
వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాల మేరకు ఈ ఏడాది వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో అశ్వారావుపేటలోని కళాశాలలో ఉద్యాన బీఎస్సీలో 30 సీట్లతో కోర్సు ప్రారంభించాలని నిర్ణయించి, కౌన్సెలింగ్ తేదీలను ప్రకటించింది. ఇప్పటికే ఇక్కడ ఉద్యాన విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ప్రత్యేక కళాశాల కొనసాగుతున్నది. ఈ నేపథ్యంలో అగ్రికల్చర్ వర్సిటీ ఉద్యాన కోర్సును ప్రారంభించడం వల్ల ఉద్యాన వర్సిటీ ప్రత్యేకతను కోల్పోవడంతోపాటు సీట్ల భర్తీ ఇబ్బందికరంగా మారే అవకాశం ఉన్నందున, దీనిపై పునరాలోచన చేయాలని ఉద్యాన వర్సిటీ వీసీ డాక్టర్ రాజిరెడ్డి రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు.
దీంతో అశ్వారావుపేట అగ్రికల్చర్ కాలేజీలో ఉద్యాన బీఎస్సీ కోర్సు నిలిపివేయాలని మంత్రి తుమ్మల సూచించారు. రాష్ట్ర వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శి సురేంద్రమోహన్ అశ్వారావుపేట అగ్రికల్చర్ కాలేజీలో కేవలం అగ్రికల్చర్ బీఎస్సీ సీట్లను మాత్రమే భర్తీ చేయాలని ఆదేశించారు. త్వరలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యానవర్సిటీ బీఎస్సీ కోర్సుల సీట్ల భర్తీకి కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్టు వీసీ డాక్టర్ డీ రాజిరెడ్డి వెల్లడించారు.