జగిత్యాల, మే 7 (నమస్తే తెలంగాణ) : కరీంనగర్ జిల్లా కేంద్రంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంపు కార్యాలయంపై బీజేపీ గూండాలు, కేంద్ర హోంశాఖ సహాయ శాఖ మంత్రి బండి సంజయ్ మనుషులు దాడి చేయడం అత్యంత హేయమైన చర్య అని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీమంత్రి తాటిపర్తి జీవన్రెడ్డి తీవ్రంగా ఖండించారు. హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డిపై దాడి సభ్యసమాజానికి సిగ్గుచేటని మండిపడ్డారు. హింసతో బీఆర్ఎస్ని అణచివేయాలని చూస్తున్నారని, అది వారితో అయ్యే పని కాదని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో బీఆర్ఎస్ను ఎదిరించడం కాంగ్రెస్కు సాధ్యం కావడం లేదని, అందుకే బీజేపీతో కలిసి కుమ్మకు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన అసభ్యకరమైన భాషను ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంపు కార్యాలయంలో హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, నేతలు విమర్శిస్తే, వారిపై బీజేపీ శ్రేణులు, బండి సంజయ్ అనుచరులు భౌతిక దాడులకు తెగబడడం, ఆస్తులను ధ్వంసం చేయడం సరికాదని హితవు పలికారు. సమావేశంలో జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత, చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, జడ్పీ మాజీ వైస్ చైర్మన్ హరిచరణ్రావు తదితరులు పాల్గొన్నారు.