హైదరాబాద్, ఏప్రిల్ 6 (నమస్తే తెలంగాణ): మీ వాహనాలు లేదా యంత్రాల్లో ఇంధనం అయిపోయిందా? కంగారు పడనక్కర్లేదు. సమాచారం అందిస్తే నిమిషాల్లో మీ ఎదుటే ట్యాంకర్ ప్రత్యక్షమవుతుంది. పెట్రోల్/డీజిల్ నింపి, బిల్లు తీసుకెళ్తుంది. ఆదిలాబాద్ జిల్లాలోని బీపీసీఎల్ పెట్రోల్ పంప్ యజమాని ముడుపు ప్రేమేందర్రెడ్డి ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక ట్యాంకర్ పంప్ను రూపొందించి సేవలు అందిస్తున్నారు. దీనిపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. అధిక మొత్తంలో ఇంధనం అవసరమైతేనే ఈ ట్యాంకర్ వస్తుంది. దీనికి అదనంగా ఎలాంటి చార్జీలను వసూలు చేయరు. ఎమ్మార్పీ ధరకే ఇంధనాన్ని అందిస్తున్నారు. దీంతో ఇంధనం కోసం పెట్రోల్ బంక్ వరకు వెళ్లాల్సిన ప్రయాస తప్పడంతోపాటు డబ్బు, సమయం ఆదా అవుతున్నది. వివిధ ప్రాజెక్టుల్లో వాహనాలు, యంత్రాలతో పనులు చేయిస్తున్న కాంట్రాక్టర్లకు ఇది ఎంతో ఉపకరిస్తున్నది.
దాదాపు 5 వేల లీటర్ల పరిమాణం కలిగిన ఈ ట్యాంకర్ను ప్రేమేందర్రెడ్డి రూ.32 లక్షలతో సిద్ధం చేశారు. ఆర్డర్ వచ్చిన ప్రాంతానికి దీన్ని తీసుకెళ్లేందుకు అనుమతులన్నీ తీసుకొన్నారు. ట్యాంకర్కు బిగించిన పంప్ ద్వారా ఇంధనాన్ని అందించి, బిల్లు తీసుకొంటున్నారు. దీంతో వివిధ ప్రాజెక్టుల కాంట్రాక్టర్ల నుంచి తమకు ఆర్డర్లు వస్తున్నాయని, ప్రాజెక్టు సైట్లలోనే రోజువారీగా ఇంధనాన్ని పొందేందుకు ఒప్పందాలు చేసుకొంటున్నారని ప్రేమేందేర్రెడ్డి ‘నమస్తే తెలంగాణ’కు వివరించారు. సాధారణంగా విమానాశ్రయాల్లో మాత్రమే కనిపించే ఇంధన ట్యాంకర్ పంప్లతో సామాన్య వినియోగదారులకూ సేవలు అందిస్తే బాగుంటుందన్న ఆలోచనతో ఈ వినూత్న సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చినట్టు చెప్పారు.