హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 20 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, ఐటీ పరిశ్రమ అభివృద్ధికి చేపట్టిన పాలసీలపై తమిళనాడు ఐటీ శాఖ మంత్రి పలనివేల్ త్యాగరాజన్ (పీటీఆర్)తో కూడిన బృందం ప్రశంసల జల్లు కురిపించింది. హైదరాబాద్ కేంద్రంగా ఐటీ పరిశ్రమ ఎదుగుతున్న తీరు అద్భుతం అని కొనియాడింది. ఐటీ రంగంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, ఐటీ పాలసీలపై అధ్యయనం చేసేందుకు తమిళనాడు ఐటీ శాఖ మంత్రి పలనివేల్ త్యాగరాజన్ ఆధ్వర్యంలో ఓ బృందం మూడు రోజులపాటు రాష్ట్రంలో పర్యటిస్తున్నది. ఇందులో భాగంగా శుక్రవారం హైదరాబాద్కు చేరుకొన్న పీటీఆర్ బృందం సచివాలయంలో తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్తో సమావేశం అయ్యింది.
ఐటీ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన అనేక కార్యక్రమాలు, ఐటీ, ఐటీ అనుబంధ పాలసీలు, పరిశ్రమల బలోపేతం కోసం చేపట్టిన అనేక అంశాలను పవర్పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తమిళనాడు బృందానికి మంత్రి కేటీఆర్ వివరించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తొలి రోజుల్లో ఐటీ పరిశ్రమ హైదరాబాద్ నుంచి తరలివెళ్తుందన్న ప్రచారం పెద్ద ఎత్తున జరిగిందని, అంతటి ఇబ్బందికరమైన పరిస్థితుల నుంచి తెలంగాణ ఐటీ పరిశ్రమ వేగంగా వృద్ధి చెందిందని వివరించారు. రాష్ట్రానికి కొత్త పెట్టుబడులు తీసుకురావడం అత్యంత ప్రాధాన్య అంశంగా నిర్ధారించుకున్నప్పటికీ అప్పటికే కార్యకలాపాలు నిర్వహిస్తున్న సంస్థలతోనూ స్నేహపూర్వక సంబంధాలను ఏర్పరచుకొని, వారికి అన్ని విధాల సహాయసహకారాలను అందించామని వెల్లడించారు. దీంతో అప్పటిదాకా హైదరాబాద్ నగరంలో పరిమిత కార్యకలాపాలు నిర్వహిస్తున్న గూగుల్, అమెజాన్, ఫేస్బుక్, సర్వీస్ నౌ తదితర దిగ్గజ కంపెనీలు హైదరాబాద్ నగరాన్ని తమ అతిపెద్ద, రెండో అతిపెద్ద కార్యాలయాలకు కేంద్రంగా మార్చుకొన్నాయని మంత్రి కేటీఆర్ వివరించారు.
హైదరాబాద్తోపాటు ద్వితీయ శ్రేణి నగరాలకు ఐటీ పరిశ్రమను విస్తరించాలన్న లక్ష్యంతో వరంగల్, మహబూబ్నగర్, ఖమ్మం, నిజామాబాద్, సిద్దిపేట లాంటి పట్టణాల్లో ప్రభుత్వ ఖర్చుతో ఐటీ టవర్లను ఏర్పాటు చేశామని మంత్రి కేటీఆర్ తెలిపారు. టాస్, టీ హబ్, వీ హబ్ వంటి ఉప కార్యాలయాలను ఏర్పాటు చేయడం ద్వారా స్థానిక విద్యావంతులకు శిక్షణ ఇచ్చేందుకు వీలవుతున్నదని వివరించారు. ఐటీతోపాటు ఆన్లైన్, మొబైల్, డిజిటల్ సేవల్లో తెలంగాణ అగ్రస్థానంలో ఉన్నదని చెప్పారు. ఐటీ పరిశ్రమ అభివృద్ధి కోసం తెలంగాణ కృషిని సావధానంగా తెలుసుకొన్న పీటీఆర్ బృందం తెలంగాణ విధానాలు, పాలసీలపైన ప్రశంసలు కురిపించింది. తమిళనాడు ఐటీ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తనకు ఈ పర్యటన ఉపయుక్తంగా ఉంటుందని పీటీఆర్ తెలిపారు. ఇకడి ఆదర్శ విధానాలను తమిళనాడులో అమలు చేసేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు. తెలంగాణ ఐటీ శాఖ ద్వారా చేపట్టిన ఇతర కార్యక్రమాలు కూడా తమకు స్ఫూర్తినిచ్చాయని పేర్కొన్నారు. తమ పర్యటనకు అన్ని విధాలుగా సహకరిస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్కు మంత్రి పీటీఆర్ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు.