‘నేను న్యాయమూర్తిని.. కసాయిని కాద’ని బ్రిటిషర్ల ముఖంపై చెప్పేశాడు. ‘నేటి ఘటనలతో నాకెలాంటి సంబంధమూ లేదు. వీటి పర్యవసానాలకూ నాకు సంబంధం లేదు. కాబట్టి వాటికి నేను బాధ్యత వహించను’ అంటూ ఓ నోట్ రాశాడు. కేంద్ర శాసనసభలో బాంబు దాడి కేసులో భగత్సింగ్, రాజ్గురు, సుఖదేవ్ల విచారణ నుంచి తప్పుకుంటున్నట్టు ధైర్యంగా న్యాయమూర్తి ఆఘా హైదర్ ప్రకటించాడు. 12 మే 1930న రాసిన ఈ నోట్ భారత దేశ చరిత్రలో నిలిచిపోయింది.
8 ఏప్రిల్ 1929.. కేంద్ర శాసన సభలో వాడి వేడి చర్చ సాగుతోంది. భారత రాజ్యంగ సంస్కరణల కోసం నియమితుడైన సర్ జాన్ సైమన్ సభలో ఉన్నాడు. ఇంకా ఎందరో మహామహులున్నారక్కడ. విప్లవకారులు భగత్సింగ్, బటుకేశ్వర్ దత్ ఆ సభలోకి బాంబు విసిరారు. బ్రిటిష్ ప్రభుత్వం ఉలిక్కిపడింది. ఆ తర్వాత ‘విచారణ, తీర్పు ఓ నాటకం ఇంగ్లిష్ న్యాయం ఓ బూటకం’ అని ఆ కేసు విచారించిన న్యాయమూర్తే చెప్పారు. ఒక అబద్దాన్ని నిజం చేస్తూ సంతకం పెట్టాల్సి వస్తే కలాన్ని విరిచేస్తానన్న ఆ న్యాయమూర్తి భారతీయులకు ప్రియమైనవాడిగా చరిత్రలో నిలిచిపోయారు. హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ ఆర్మీ విప్లవకారులు భగత్ సింగ్, బటుకేశ్వర్ దత్ను ఈ కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత బ్రిటిష్ పోలీసు అధికారి సాండర్స్ హత్య కేసులోనూ భగత్ సింగ్ని సహ నిందితుడిగా చేర్చారు.
ఇంగ్లిష్ న్యాయం
కఠినమైన శిక్ష వేసి, భారతీయ యువతలో భయం పుట్టించాలని వైస్రాయ్ ఆలోచన. ఈ కేసు విచారణ కోసం ప్రత్యేక ట్రిబ్యునల్ను ఏర్పాటు చేయాలని లాహోర్ హైకోర్ట్ ప్రధాన న్యాయమూర్తిని ఆదేశిస్తూ వైస్రాయ్ ఆర్డినెన్స్ జారీ చేశాడు. ప్రధాన న్యాయమూర్తి మే 1న ప్రత్యేక న్యాయస్థానం ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించాడు. ఇందులో ఆగా హైదర్తోపాటు ఇద్దరు ఆంగ్లేయ న్యాయమూర్తులు కోల్స్ట్రీవ్ు, హిల్టన్ ఉన్నారు. ‘ఇంగ్లిష్ న్యాయం ప్రకారం’ తీర్పు ఇవ్వడం కోసం ఏర్పాటైన ఈ న్యాయస్థానం మే 5 నుంచి విచారణ ప్రారంభించింది.
విప్లవం వర్ధిల్లాలని అన్నందుకు..?
మే 12న న్యాయస్థానం ముందు నిందితులను హాజరుపరిచారు. ‘విప్లవం వర్ధిల్లాలి’ అంటూ వాళ్లు నినాదాలు చేస్తున్నారు. ‘సర్ఫరోషికి తమ’న్నా అంటూ భగత్సింగ్ బృందం ఆలపిస్తున్నది. విచారణ మొదలైంది. కోల్స్ట్రీవ్ు ఆదేశాలతో పోలీసులు వాళ్లను ఒళ్లు హూనమయ్యేలా కొట్టారు.
మే 12 హింస తర్వాత విచారణ మళ్లీ ప్రారంభమైంది. ప్రత్యేక న్యాయస్థానానికి అధ్యక్షుడిగా ఉన్న కోల్స్ట్రీట్ వైఖరిని నిరసిస్తున్నామని, ఈ ప్రహసనంలో మేం భాగస్వాములం కాదలుచుకోలేదని, ఈ విచారణలో పాల్గొనలేమని న్యాయవాదులు కోర్టుకు లేఖ రాశారు. కేసుకు సంబంధించిన కాగితాలను విసిరేసి వెళ్లిపోయారు. నిందితులు, వారి న్యాయవాదులు లేకుండానే విచారణ ప్రారంభమైంది. ఆ పరిస్థితులను చూసి ఆగా హైదర్ భారతీయ హృదయం తట్టుకోలేకపోయింది. డిఫెన్స్ న్యాయవాదులు లేని లోటుని పూడుస్తూ తానే పోలీసులు ప్రవేశపెట్టిన సాక్షులు జైగోపాల్, ఫణీంద్రనాథ్, మన్మోహన్ బెనర్జీ, హన్స్ రాజ్ వోరాలను క్రాస్ ఎగ్జామిన్ చేశారు. పోలీసులు చెప్పిందే వల్లిస్తున్న సాక్షులను తికమకపెడుతూ వాళ్లుచెప్పేదాంట్లోని డొల్లతనాన్ని బయటపెట్టే ప్రయత్నం చేస్తున్నారు.
పోలీసుల దొంగ సాక్ష్యాలు
సాక్షి రావ్ుచరణ్ దాస్ని క్రాస్ ఎగ్జామిన్ చేసి ప్రత్యేక న్యాయస్థానంలో జరుగుతున్న మొత్తం నాటకాన్ని ఆగా హైదర్ బయటపెట్టారు. రావ్ు చరణ్ చేతిలో ఒక పత్రం ఉంది. పోలీసు అధికారులు దానిని తన చేతికిచ్చి బట్టీ పట్టమన్నారని, కోర్టులో అదే చెప్పమన్నారని తెలిపాడు. పోలీస్ స్టేషన్లో ఉండలేకపోతున్నానని, బయటపడాలంటే ఇలా సాక్ష్యం చెప్పకతప్పదని బలవంతపెట్టారని చెప్పాడు. ఈ కాగితం ఇచ్చారంటూ దానిని చూపించాడు. ఇలా సాక్ష్యం చెప్పడం తనకిష్టంలేదని రావ్ు చరణ్ కోర్టుకు చెప్పాడు. ఆ కాగితాన్ని న్యాయమూర్తులకు అందజేశాడు.
ఏడుగురు ప్రత్యక్ష సాక్షుల్లో ఆరుగురిని ఆగా హైదర్ క్రాస్ ఎగ్జామిన్ చేసిన తీరు తెలిసిన తర్వాత బ్రిటిష్ ప్రభుత్వం చిక్కుల్లో పడింది. ముందుగా అనుకున్నట్టు విచారణ పేరుతో వాళ్లకు మరణశిక్ష విధించాలంటే ముగ్గురు న్యాయమూర్తులూ ఉరిశిక్షకు అనుకూలంగా తీర్పు ఇవ్వాలి. కానీ హైదర్ అందుకు మొగ్గు చూపడని తెలిసి, ఆయన్ని ప్రలోభపెట్టే ప్రయత్నం చేసింది. ఒక రోజు ఆయన ఇంటికి ఓ ప్రతినిధిని పంపించింది. ‘నేను న్యాయమూర్తిని, కసాయివాడిని కాను’ అంటూ హైదర్ ఘాటుగా అతనికి బదులిచ్చారు. హైదర్ వల్ల కోర్టు నాటకంలో బ్రిటిష్ పాలకుల కథ అడ్డం తిరిగింది.
అప్పుడు చీఫ్ జస్టిస్ రంగంలోకి దిగాడు. అనారోగ్య కారణాల వల్ల హైదర్ని ప్రత్యేక న్యాయస్థానం బాధ్యతల నుంచి తప్పిస్తున్నామని ఆదేశాలిచ్చాడు. అలాగే హైదర్ స్థానంలో వెన్నెముకలేని న్యాయమూర్తిని నియమించాడు. ఆ తర్వాత భగత్సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్లకు మరణశిక్ష విధించారు. ఆ కేసు తర్వాత ఆగా హైదర్ ఉద్యోగం మానేశారు. సహారన్పూర్ (ఉత్తర్ప్రదేశ్లో ఉంది) లో స్థిరపడ్డారు. 1937లో జరిగిన ప్రావిన్షియల్ ఎన్నికల్లో పాల్గొని గెలిచారు.