హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 13 (నమస్తే తెలంగాణ): శ్రీచైతన్య విద్యాసంస్థల చైర్మన్ బొప్పన సత్యనారాయణరావు (75) కన్నుమూశారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బాత్రూంలో జారిపడ్డారు. జూబ్లీహిల్స్ అపోలో దవాఖానకు తరలించగా, చికిత్స పొందుతూ గురువారం మృతిచెందారు. విజయవాడ తాడిగడప క్యాంపస్లోని స్వగృహానికి ఆయన భౌతికకాయాన్ని తరలించారు. శుక్రవారం అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు.
అంచెలంచెలుగా ఎదిగిన బీఎస్రావు…
కృష్ణా జిల్లా అంగులూరులో 1945 ఆగస్టు 15న బొప్పన నాగభూషణం, జానమ్మ దంపతులకు మూడో సంతానంగా జన్మించారు. గుంటూరు మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ పూర్తి చేశారు. వృత్తిరీత్యా బీఎస్రావు దంపతులిద్దరూ వైద్యులే. ఆయన వైద్యశాస్త్రంలో పట్టా పొందిన తర్వాత తొలినాళ్లలో ఇంగ్లండ్, ఐర్లాండ్, ఇరాన్లో 15 ఏండ్లు వైద్య సేవలందించారు. ఆయనకు భార్య డాక్టర్ ఝూన్సీలక్ష్మీబాయి, ఇద్దరు కుమార్తెలు సీమ, సుష్మ ఉన్నారు. విజయవాడ శివారు పోరంకిలో 1986లో శ్రీచైతన్య విద్యాసంస్థలను స్థాపించారు. విజయవాడలోనే తొలిసారి 56 మంది విద్యార్థినులతో గర్ల్స్ జూనియర్ కాలేజీ ప్రాంభించారు. 1991లో హైదరాబాద్లో బాలుర కళాశాలను నెలకొల్పి దేశవ్యాప్తంగా విద్యాసంస్థలను విస్తరించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 321 జూనియర్ కాలేజీలు, 322 టెక్నో స్కూళ్లు, 107 సీబీఎస్ఈ పాఠశాలలు ఉన్నాయి. ఆయన విద్యాసంస్థల్లో ప్రస్తుతం 8.5 లక్షల మంది చదువుతున్నారు.