హైదరాబాద్, జూలై 25(నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి వ్యవహార శైలిపై ఆ పార్టీ అధిష్ఠానం తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్టు తెలుస్తున్నది. అదే పనిగా పార్టీ వ్యతిరేక వ్యాఖ్యలు చేయడం, పార్టీ మారడం చారిత్రక అవసరమని చెప్పుకోవడం, బీజేపీ అగ్రనేత అమిత్షాను కలవడం.. తదితర వార్తలకు సంబంధించిన క్లిప్పింగ్లను పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్కం ఠాగూర్ ఇప్పటికే అధిష్ఠానానికి అందజేసినట్టు తెలిసింది.
ఈ నేపథ్యంలో రాజగోపాల్రెడ్డికి షోకాజ్ నోటీసులు జారీ చేయాలని నిర్ణయించినట్టు సమాచారం. ముఖ్యంగా సోనియాగాంధీ ఈడీ విచారణ విషయంలో చట్టం తన పని తాను చేసుకొంటూ పోతున్నదని రాజగోపాల్రెడ్డి చేసిన వ్యాఖ్యలను అధిష్ఠానం తీవ్రంగా పరిగణించినట్టు సమాచారం. మరోవైపు రాష్ట్ర నేతలు ఆయనను బుజ్జగించేందుకు ప్రయత్నిస్తున్నారు. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సోమవారం రాజగోపాల్రెడ్డి ఇంటికి వెళ్లి ఆయనతో చర్చించారు. పార్టీ మారొద్దని, కలిసి పనిచేద్దామని కోరారు. కానీ రాజగోపాల్రెడ్డి మాత్రం పార్టీ మార్పు దిశగా మాట్లాడినట్టు తెలిసింది.