నీలగిరి, ఆగస్టు 1: సులువుగా డబ్బు సంపాదించాలనే ఆలోచనతో ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ బాబా అవతారమెత్తాడు. యూట్యూబ్ చానెల్ ద్వారా రోగాలు, మానసిక సమస్యలకు హోమాలు, యజ్ఞాలు చేస్తూ, తాయెత్తులు ఇస్తూ ప్రచారంలోకి వచ్చాడు. ఓ మహిళ ఫిర్యాదుతో నకిలీ బాబా బాగోతం బట్టబయలైంది. వివరాల్లోకి వెళ్తే.. ఏపీలోని కృష్ణా జిల్లాకు చెందిన విశ్వచైతన్య హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తూనే పలు వ్యాపారాలు చేసి నష్టపోయాడు. దాంతో సులభంగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో ఏడాది కిందట నల్లగొండ జిల్లా పెద్దఅడిశర్లపల్లి మండలం అజ్మాపురానికి మకాం మార్చి.. పది ఎకరాల భూమిని కొనుగోలు చేసి హైటెక్ హంగులతో ఆశ్రమం ఏర్పాటు చేశాడు. ఆశ్రమంలో సాయిబాబా ప్రవచనాలు.. హోమాలు జరిపిస్తూ ఆర్థ్ధిక ఇబ్బందులు, పలు రోగాలు, మానసిక జబ్బులతో బాధపడేవారిని తన యూట్యూబ్ చానల్ ద్వారా ఆకర్షించాడు. ఈ క్రమంలో ఓ మహిళ బాబా తనను మోసం చేశాడని, లైంగికంగా వేధించాడని పోలీసులను ఆశ్రయించగా శనివారం రాత్రి టాస్క్ఫోర్స్ పోలీసులు విశ్వచైతన్యను అదుపులోకి తీసుకున్నారు. ఆశ్రమంలో అసాంఘిక కార్యక్రమాలు సాగుతున్నట్టు గుర్తించారు. విశ్వచైతన్య తన యూట్యూబ్ చానెల్ ద్వారా 7 లక్షల మంది భక్తులను సంపాదించినట్టు సమాచారం. వారి సమస్యలకు పరిష్కారం చూపిస్తానని, హోమాలు చేస్తానని లక్షల రూపాయలు వసూలు చేశాడని ఆరోపణలున్నాయి. టాస్క్ఫోర్స్ పోలీసులు ఆశ్రమంపై దాడి చేసి రూ.30 లక్షల నగదు, బంగారం, రూ.14 కోట్ల విలువైన స్థిరాస్తి డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది.