హైదరాబాద్, మే 19 (నమస్తే తెలంగాణ) : వచ్చే నెలలో విద్యా సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యాశాఖ క్యాలండర్ను ఇటీవల విడుదల చేసిన ప్రభుత్వం, ఎంతో కీలకమైన విద్యాశాఖకు పూర్తిస్థాయి కార్యదర్శిని నియమించింది. గురువారం పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేసిన ప్రభుత్వం.. వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్గా ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారిణి వాకాటి కరుణను విద్యాశాఖ కార్యదర్శిగా నియమించింది. అలాగే జీఏడీ ముఖ్యకార్యదర్శిగా ఉన్న వికాస్రాజ్ను సీఈవోగా బదిలీ చేసిన తరువాత కొద్దిరోజుల నుంచి ఈ శాఖ ఖాళీగా ఉన్నది. దీంతో సీఎం కార్యదర్శిగా కొనసాగుతున్న 1999 బ్యాచ్ సీనియర్ ఐఏఎస్ అధికారి శేషాద్రికి ప్రభుత్వంలో కీలకమైన జీఏడీ పూర్తిస్థాయి బాధ్యతలను అదనంగా అప్పగించారు.
ఇప్పటివరకు అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల విభాగం నుంచి ప్రభుత్వం ఆయనను రిలీవ్ చేసింది. వీరితోపాటు మరికొందరు సీనియర్ ఐఏఎస్లకు పోస్టింగ్లు ఇచ్చింది. ఈ మేరకు గురువారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. 1998 బ్యాచ్ ఐఏఎస్ అధికారి సందీప్కుమార్ సుల్తానియాను విద్యాశాఖ కార్యదర్శి అదనపు బాధ్యతల నుంచి రిలీవ్ చేసి యువజన సర్వీసుల శాఖ కార్యదర్శిగా అదనపు బాధ్యతలు అప్పగించారు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శిగా అలానే కొనసాగుతారు. 2000 బ్యాచ్ ఐఏఎస్ అధికారి రాహుల్ బొజ్జాకు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ సీఐజీగా పూర్తి బాధ్యతలు అప్పగించారు. అలాగే సర్వే సెటిల్మెంట్ అండ్ ల్యాండ్రికార్డ్స్, భూభారతి ప్రాజెక్టు డైరెక్టర్గా అదనపు బాధ్యతలు అప్పగించారు.
అదనపు సీఈవోగా ఉన్న 2002 బ్యాచ్ ఐఏఎస్ అధికారి డాక్టర్ జ్యోతి బుద్ధప్రకాశ్ను బదిలీ చేసి చేనేత జౌళిశాఖ కార్యదర్శిగా నియమించారు. ఇప్పటివరకు ఈ శాఖకు కార్యదర్శిగా, కమిషనర్గా రెండు బాధ్యతలు నిర్వహిస్తున్న 1997 బ్యాచ్ సీనియర్ ఐఏఎస్ అధికారిణి శైలజ రామయ్యర్ను కమిషనర్గా కొనసాగిస్తూ కార్యదర్శి బాధ్యతల నుంచి రిలీవ్ చేశారు. సీనియర్ ఐఏఎస్ అధికారి జ్యోతిబుద్ధ ప్రకాశ్కు రవాణాశాఖ కమిషనర్గా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇప్పటివరకు అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న 2001 బ్యాచ్ ఐఏఎస్ అధికారి కేఎస్ శ్రీనివాసరాజును రిలీవ్ చేశారు. వైద్యారోగ్యశాఖ కార్యదర్శిగా ఉన్న 1999 బ్యాచ్ ఐఏఎస్ అధికారి సయ్యద్ అలీ ముర్తుజా రిజ్వీకి డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్, ప్రజారోగ్య కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్గా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు అప్పగించారు.
విద్యాశాఖకు మహిళా సారథ్యం
చిన్నారుల బాధ్యతలను కన్నతల్లుల్లా చూసుకునే మహిళామణులకే ప్రభుత్వం విద్యాశాఖ సారథ్యాన్ని అప్పగించింది. విద్యార్థులను భావిభారత పౌరులుగా అత్యంత సమర్థవంతంగా నిర్వహించే శక్తిసామర్థ్యాలు మహిళలకే ఎక్కువగా ఉంటాయని గుర్తించిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ఇప్పటికే విద్యాశాఖ బాధ్యతలను సీనియర్ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి అప్పగించారు. అలాగే పాఠశాల విద్యాశాఖ కమిషనర్గా దేవసేనను నియమించారు. తాజాగా విద్యాసంవత్సరం ప్రారంభం అవుతున్న నేపథ్యంలో విద్యాశాఖ కార్యదర్శిగా 2004 బ్యాచ్ ఐఏఎస్ అధికారిణి వాకాటి కరుణను నియమించారు. ఇలా మంత్రి నుంచి కమిషనర్ వరకు ఉన్నతస్థాయిలో విద్యాశాఖ సారథ్యాన్ని సీఎం కేసీఆర్ మహిళలకు అప్పగించారు.