హైదరాబాద్, ఫిబ్రవరి27 (నమస్తే తెలంగాణ): న్యాయ కోవిదుడిగా, కేంద్ర మంత్రిగా దివంగత పుంజాల శివశంకర్ దేశానికి, దళిత బహుజన సమాజానికి చేసిన సేవలు చిరస్మరణీయమని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర కొనియాడారు. శివశంకర్ 6వ వర్ధంతిని పురస్కరించుకొని బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలోని తన నివాసంలో శివశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎంపీ రవిచంద్ర మాట్లాడుతూ విదేశాంగ, మానవ వనరుల అభివృద్ధి, న్యాయ, పెట్రోలియం శాఖల మంత్రిగా శివశంకర్ సేవలను స్మరించుకొన్నారు. బీసీ కులాల వర్గీకరణకు చట్టబద్ధత కల్పించి, న్యాయవ్యవస్థలో దళిత బహుజనులకు ప్రాధాన్యం పెరగడానికి ఆయన కృషి చేశారని కొనియాడారు. కార్యక్రమంలో మున్నూరుకాపు ప్రముఖులు పుటం పురుషోత్తం పటేల్, మరికల్పోత సుధీర్కుమార్, ఆకుల రజిత్, స్వామి వివేక్పటేల్, జెన్నాయికోడె జగన్మోహన్, చంద్రశేఖర్, పులిపాటి దామోదర్, వాస్తుశిల్పి ముద్దు వినోద్ తదితరులు పాల్గొన్నారు.