హైదరాబాద్, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ): తెలుగు యువకుడికి అరుదైన ఘనత దక్కింది. ఫోర్బ్స్ టాప్-30 యువ సాధకుల జాబితాలో ఏపీలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ద్రాక్షారామానికి చెందిన యువకుడు శివతేజ చోటు దక్కించుకున్నారు. కాకిలేటి సూరిబాబు కుమారుడైన శివతేజ ఐఐటీ గువాహటిలో ఈసీఈ మేజర్ డిగ్రీగా, సీఎస్ఈ మైనర్ డిగ్రీగా ఏకకాలంలో పూర్తి చేశారు. ప్రస్తుతం శివతేజ బెంగళూరులో నిరామయ్ అనే వైద్య సంబంధిత సాఫ్ట్వేర్ కంపెనీని కొందరి భాగస్వామ్యంతో ప్రారంభించి రొమ్ము క్యాన్సర్ను గుర్తించే ప్రాజెక్టుపై పరిశోధనలు చేస్తున్నారు.
ఇందులో శివతేజ మెషిన్ లెర్నింగ్ టీమ్కు నాయకత్వం వహిస్తూనే.. నెదర్లాండ్స్లోని మాస్ట్రిక్ట్ యూనివర్సిటీలో క్లినికల్ డాటా సైన్స్లో పీహెచ్డీ పూర్తి చేశారు. మెడికల్ ఇమేజింగ్లో ఏడేండ్లకు పైబడి అనుభవం ఉన్న శివతేజ ఇప్పటివరకు 25కు పైగా అంతర్జాతీయ ప్రచురణలతో పాటు రెండు పుస్తక అధ్యాయాలకు సహ రచన కూడా చేశారు. 23 అంతర్జాతీయ పేటెంట్లు పొందారు. ఆయన పరిశోధనలను గుర్తించిన ఫోర్బ్స్ పత్రిక యువ సాధకుల జాబితాలో స్థానం కల్పించింది. దీంతో ద్రాక్షారామం వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు శివతేజను అభినందనలతో ముంచెత్తారు.