హైదరాబాద్, అక్టోబర్ 16 (నమస్తే తెలంగాణ): పేదల బాంధవుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో పనిచేయడం తన అదృష్టంగా భావిస్తున్నట్టు మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు పేర్కొన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ మినహా మరో నాయకుడు, టీఆర్ఎస్ మినహా మరో పార్టీ అవసరంలేదని చెప్పారు. అందుకే తాను ఈ నెల 18న టీఆర్ఎస్లో చేరుతున్నట్టు వెల్లడించారు. అది తన జీవితంలో గొప్ప సుదినమని పేర్కొన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దళితబంధు పథకం ద్వారా దళితుల శాశ్వత వికాసానికి కంకణం కట్టుకొన్న సామాజిక న్యాయవాది కేసీఆర్ అని ప్రశంసించారు. 75 ఏండ్ల స్వతంత్ర భారతదేశ చరిత్రలో కేసీఆర్ మాదిరిగా ఏ పాలకుడూ కులవ్యవస్థను కూకటి వేళ్లతో పెకిలించలేదని చెప్పారు. ఈ పథకాన్ని ప్రయోగాత్మకంగా ప్రారంభించిన హుజూరాబాద్ నియోజకవర్గంలోని దళితులందరి జీవితాల్లో మార్పు వస్తుందని పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల పేదలకు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అద్భుతంగా అమలవుతున్నాయని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలన్నీ ఏకమై సీఎం కేసీఆర్కు అండగా ఉండాలని పిలుపునిచ్చారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్యాదవ్ గెలవడం ఖాయమని చెప్పారు. తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఇంతమంచి పార్టీని, నాయకుడిని చూడలేదని చెప్పారు.