హైదరాబాద్ : అటవీ నేరాలను మరింత సమర్థవంతంగా అరికట్టేందుకు రహస్య సమాచార నిధి (Secret Service Fund) ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని అటవీశాఖ, ఇందుకు సీఎం కేసీఆర్ రూ.4.06కోట్లు కేటాయించారని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి వెల్లడించారు. ఆక్రమణలు, వన్య ప్రాణుల వేట, స్మగ్లింగ్ను అరికట్టేందుకు సమాచారం ఇచ్చే వారిని ప్రోత్సహించేందుకు ఈ నిధిని వినియోగించనున్నారు. అటవీ కార్యకలాపాలపై మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో (MCR HRD) జరిగిన ఒక రోజు వర్క్షాప్లపై రహస్య నిధిపై చర్చించారు.
ఫారెస్ట్ డివిజనల్ అధికారి (FDO) నేతృత్వంలో రూ.2లక్షల నుంచి రూ.3లక్షలు, జిల్లా అటవీ అధికారి (DFO) రూ.3లక్షల నుంచి రూ.7లక్షలు, చీఫ్ కన్జర్వేటర్కు రూ.5 లక్షల నుంచి రూ.13 లక్షలు, పీసీసీఎఫ్కు రూ.50 లక్షలు ఈ నిధి నుంచి రహస్య సమాచారం విలువ ఆధారంగా ప్రోత్సాహకాలు అందించేలా నిబంధనలు విధించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పచ్చదనం పెంపు, పునరుద్ధరణకు సీఎం కేసీఆర్ ఇస్తున్న ప్రాధాన్యత నేపథ్యంలో అటవీ అధికారులు, సిబ్బందిపై బాధ్యత మరింత పెరిగిందన్నారు. ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా అధికారులు పని చేస్తూ, అడవులను రక్షించే బాధ్యత చిత్తశుద్ధితో నిర్వహించాలని సూచించారు.
ములుగు జిల్లాలో పులిని వేటాడిన ఘటన బాధాకరమని, భవిష్యత్లో ఇలాంటి సంఘటనలు జరుగకూడన్నారు. పచ్చదనం పెంపు, గ్రీన్ ఫండ్, అటవీ పునరుద్ధరణ, రక్షణ, ఆక్రమణల నివారణ, వన్యప్రాణుల వేట, స్మగ్లింగ్ అరికట్టడం, అర్బన్ ఫారెస్ట్ పార్క్ల వంద శాతం అభివృద్ధిపై వర్క్షాప్లో బృందాల వారీగా చర్చించారు. అనంతరం సీఎం ప్రత్యేక కార్యదర్శి భూపాల్రెడ్డి మాట్లాడుతూ ఆక్రమణలను శాశ్వతంగా నివారించే దిశగా సీఎం కేసీఆర్ ఆలోచిస్తున్నారని, పొడు సమస్య పరిష్కారానికి చర్యలు మొదాలయ్యాయన్నారు. తగిన రక్షణ చర్యలు, సిబ్బంది రేషనలైజేషన్ ద్వారానే ఇది సాధ్యమవుతుందన్నారు. వివిధ అంశాలపై జిల్లా అధికారులు చెప్పిన సమస్యలు, పరిష్కార మార్గాలను ఆయన నోట్ చేసుకున్నారు.
అటవీ శాఖ బలోపేతానికి సీఎం సుముఖంగా ఉన్నట్లు తెలిపారు. ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకొని మరింత సమర్థవంతంగా పనిచేసి, అటవీ శాఖ అధికారులు ఫలితాలు చూపెట్టాలని స్పెషల్ చీఫ్ సెక్రెటరీ శాంతి కుమారి కోరారు. అవసరమైతే మరింత మంది సిబ్బందిని నియమించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. అటవీశాఖకు సీఎం కేసీఆరే బ్రాండ్ అంబాసిడర్ అని, దేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వని ప్రాధాన్యం శాఖకు తెలంగాణ ప్రభుత్వం ఇస్తుందని పీపీసీఎఫ్ శోభ అన్నారు. సంబంధిత అన్ని శాఖలు, స్థానిక ప్రజా ప్రతినిధులను సమన్వయం చేసుకుని ఫలితాలు సాధించాలన్నారు.
భవిష్యత్ తరాలకు ఉపయోగపడేలా దేశానికే ఆదర్శవంతంగా అటవీ శాఖ ఆధ్వర్యంలో పనులు నిర్వహిస్తున్నామని సీఎం ఓఎస్డీ ప్రియాంక వర్గీస్ అన్నారు. అడవుల రక్షణతో పాటు, అర్బన్ ఫారెస్ట్ పార్కులకు కూడా సమీప గ్రామాలు, కాలనీ వాసులతో ప్రొటెక్షన్ కమిటీలను నియమించాలని నిర్ణయించారు. అటవీశాఖ విషయాలపై మంత్రితో పాటు, సీఎంవో ఉన్నతాధికారుల సమక్షంలో సుమారు పది గంటల పాటు మేధో మథనం జరిగింది. క్షేత్ర స్థాయిలో సమస్యలపై జిల్లాల అధికారులు చేసిన సూచనలు వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని ఉన్నతాధికారులు హామీ ఇచ్చారు. ఈ వర్క్షాప్లో అన్ని అటవీ సర్కిళ్లకు చెందిన చీఫ్ కన్జర్వేటర్లు, అన్ని జిల్లాలకు చెందిన అటవీ శాఖ అధికారులు, ఉద్యోగ సంఘాల నేతలు పాల్గొన్నారు.