హైదరాబాద్, జూన్ 14 (నమస్తే తెలంగాణ): సంగారెడ్డి ప్రభుత్వ దవాఖాన ఆవరణలో మానసిక వైకల్యంతో బాధపడుతున్న 57 మందికి మెరుగైన వైద్యం అందించేందుకు హైదరాబాద్ ఎర్రగడ్డ దవాఖానకు తరలిస్తామని హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం నివేదించింది. సంగారెడ్డి ప్రభుత్వ దవాఖానను అధునీకరించాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపింది. అందుకే అకడి దవాఖాన ఆవరణలో న్యూ లైఫ్ సొసైటీ ఫర్ ఎడ్యుకేషన్ అండ్ డెవలప్మెంట్ ద్వారా మానసిక వైకల్య బాధితులకు అందజేస్తున్న వైద్యం కంటే, శాస్త్రీయ పద్ధతిలో ఎర్రగడ్డలో మంచి వైద్యం లభిస్తుందని ఏజీ బీఎస్ ప్రసాద్ చెప్పారు. తమ సొసైటీని ఖాళీ చేయించేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకోవాలని కోరుతూ దాఖలుచేసిన రిట్పై మంగళవారం జస్టిస్ ఏ అభిషేక్రెడ్డి విచారణ జరిపారు. మానసిక వైకల్యంతో బాధపడేవారిని దృష్టిలో పెట్టుకోవాలని పిటిషనర్ న్యాయవాది వాదించారు. వాదనల తర్వాత హైకోర్టు తన నిర్ణయాన్ని తర్వాత వెలురిస్తామని ప్రకటించింది.