Rani Rudrama | హైదరాబాద్, జూన్ 14 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో విద్యాశాఖకు మంత్రి లేకపోవడంతో దిక్కులేని శాఖగా మారిందని, వెంటనే ఓ మంత్రిని పెట్టాలని బీజేపీ అధికార ప్రతినిధి రాణి రుద్రమ డిమాండ్ చేశారు. నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడారు. ‘తెలంగాణకు విద్యాశాఖ మంత్రి కావలెను’ అని బోర్డును ఆమె ప్రదర్శించారు.
‘విద్యాశాఖకు సీఎం రేవంత్రెడ్డి ఏం చేశాడంటే.. గాడిద గుడ్డు చేశాడు’ అని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలోని 26 జిల్లాలకు డీఈవోలు లేరని, 62 డిప్యూటీ డీఈవో పోస్టులు ఖాళీగా ఉన్నాయని, 17 మండలాల్లోనే ఎంఈవోలు ఉన్నారని వివరించారు. పాఠశాలల్లో మరుగుదొడ్లు కడిగేందుకు కార్మికులు లేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారని చెప్పారు. 22 వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉంటే 11వేల ఉద్యోగాలకు మాత్రమే నోటిఫికేషన్ ఇచ్చారని తెలిపారు. కాంగ్రెస్లో విద్యాశాఖను నిర్వహించేందుకు అర్హులే లేరా అని ప్రశ్నించారు.