బంజారాహిల్స్, మార్చి 7: ప్రధాన రహదారుల్లో ప్రతియేటా రోడ్లను వేస్తుంటారు. అయితే రోడ్లు వేసే సమయంలో కొన్ని చోట్ల మ్యాన్హోళ్లు సరిగ్గా కనిపించకపోవడంతో అలాగే వదిలేస్తుంటారు. దీంతో ఆ మ్యాన్హోళ్లలో పూడిక పేరుకుపోయి.. పొంగిపొర్లుతుంటాయి.. ఈ మ్యాన్హోళ్లను గుర్తించేందుకు జలమండలి డివిజన్ -6 పరిధిలో అధికారులు సరికొత్త విధానాన్ని వినియోగిస్తున్నారు. ఈ విధానంలో భాగంగా అత్యాధునిక గ్రౌండ్ పెనెట్రేషన్ రాడార్(జీపీఆర్) పరికరం ద్వారా ప్రధాన రోడ్లపై పూడుకుపోయిన మ్యాన్హోళ్లను గుర్తిస్తున్నారు. ఈ పరికరంతో భూమిలో సుమారు అడుగున్నర లోతు వరకు ఉన్న మ్యాన్హోళ్లను గుర్తించేందుకు అవకాశం ఉంది. గతంలో జలమండలి డివిజన్- 3 పరిధిలో ఈ విధానాన్ని ఉపయోగించారు. అక్కడనుంచి బదిలీ అయి డివిజన్-6కు వచ్చిన జలమండలి జీఎం హరిశంకర్ చొరవతో ఆదివారం బంజారాహిల్స్ సెక్షన్లోని ప్రధాన ప్రాంతాల్లో ఈ రాడార్ ద్వారా సుమారు 25 వరకు మ్యాన్హోళ్లను గుర్తించారు. ట్రాఫిక్కు ఇబ్బందులు లేకుండా ఈ మ్యాన్హోళ్లను పైకి తీసుకువచ్చి పూడికను తొలిగించనున్నా రు. ఇక ఈ విధానాన్ని డివిజన్- 6లోని అన్ని ప్రాంతాల్లో వినియోగించాలని అధికారులు యోచిస్తున్నారు.
గ్రౌండ్ పెనెట్రేషన్ రాడార్(జీపీఆర్) సాయంతో పూడుకుపోయిన మ్యాన్హోళ్లను గుర్తించడం సులభమం. రాడార్లోని రేడియో తరంగాలను రోడ్డు ద్వారా భూమిలోకి పంపించినప్పుడు.. మ్యాన్హోల్ ఉంటే అవి తిరిగి వెనక్కి వస్తాయి. ఆ తరంగాల ఆధారంగా మ్యాన్హోల్ ఎంతలోతులో ఉందో తెలుసుకోవచ్చు. ఈ విధానాన్ని మేము డివిజన్-3లో వినియోగించినప్పుడు మంచి ఫలితాలు వచ్చాయి. అందుకే డివిజన్-6లో కూడా వినియోగించేందుకు చర్యలు తీసుకున్నాం. అన్ని మ్యాన్హోళ్లను గుర్తిస్తే మురుగు సమస్య తలెత్తినప్పుడు పరిష్కరించడం సులువుగా మారుతుంది.