హైదరాబాద్, ఆగస్టు 7 (నమస్తే తెలంగాణ): గ్రామీణ పారిశుద్ధ్య కార్మికులు సమ్మె విరమిస్తామని ప్రకటించారు. మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి నేతృత్వంలో సోమవారం వారు హైదరాబాద్లోని క్యాంపు కార్యాలయంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావును కలిసి ఈ ప్రకటన చేశారు. తమ సమస్యలను మంత్రికి విన్నవించి, వాటిని పరిష్కరించాలని కోరారు. దీనిపై మంత్రి దయాకర్రావు స్పందిస్తూ.. సమ్మె విరమించాలని, ఆ తర్వాత సమస్యల గురించి చర్చిద్దామని సూచించారు. అందుకు పారిశుద్ధ కార్మికులు సమ్మతించడంతో తొలుత సాధారణ డిమాండ్లను పరిశీలించి పరిష్కరిస్తామని, ఆర్థికపరమైన అంశాలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి చర్చిస్తామని మంత్రి స్పష్టం చేశారు.