న్యూఢిల్లీ: శిక్షణ సదుపాయాల నుంచి కరోనా వ్యాక్సినేషన్ వరకు భారత అథ్లెట్లకు అన్ని సౌకర్యాలు కచ్చితంగా అందించాలని, దీన్ని ప్రాధాన్యత అంశంగా పరిగణించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ క్రీడామంత్రిత్వ శాఖ అధికారులను ఆదేశించారు. టోక్యో ఒలింపిక్స్కు భారత్ సంసిద్ధతపై గురువారం జరిగిన సమీక్షలో మోదీ మాట్లాడారు. దేశానికి క్రీడలు ఎంతో ముఖ్యమైన అంశమని ఆయన అన్నారు. క్రీడాప్రపంచంలో దేశ ప్రతిష్ఠను మన అథ్లెట్లు మరింత బలోపేతం చేస్తున్నారు. ఒలింపిక్స్ కోసం టోక్యో వెళ్లే ప్రతి ఒక్కరికీ తప్పకుండా త్వరితగతిన వ్యాక్సినేషన్ పూర్తి చేయాలి అని మోదీ సూచించారు. కాగా టోక్యో ఒలింపిక్స్లో పాల్గొనున్న భారత అథ్లెట్లందరితో మోదీ జూలైలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడనున్నారని సమాచారం. దేశ ప్రజలందరి తరఫున ఆయన అథ్లెట్లతో మాట్లాడి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించనున్నారు.
10వేల మంది వలంటీర్లు ఔట్
టోక్యో ఒలింపిక్స్ విధుల నుంచి ఇప్పటి వరకు దాదాపు 10 వేల మంది వలంటీర్లు తప్పుకున్నారని నిర్వాహకులు ప్రకటించారు. వారు వైదొలిగేందుకు కరోనా ప్రభావం కూడా ఓ కారణమేనని నిర్వాహక కమిటీ సీఈవో తొషియో ముటో అన్నారు. అయితే ఒలింపిక్స్ మాత్రం షెడ్యూల్ ప్రకారం నిర్వహిస్తామని స్పష్టం చేశారు. కరోనా ప్రభావం వల్ల 2020 నుంచి వాయిదా పడిన టోక్యో విశ్వక్రీడలు ఈ ఏడాది జూలై 23 ప్రారంభం కావాల్సి ఉంది. జపాన్లో కరోనా తీవ్రత ఉండడంతో ఒలింపిక్స్పై సందిగ్ధత నెలకొంది.