హైదరాబాద్, అక్టోబర్ 4 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థ బాసర ఆర్జీయూకేటీ క్యాంప్ ఆఫీస్ను హైదరాబాద్లోని సాంకేతిక విద్యామండలి కార్యాలయంలో ఏర్పాటు చేయనున్నారు. ఆర్జీయూకేటీలో విద్యాప్రమాణాల పెంపు, సౌకర్యాల కల్పన అంశాలు, ఆన్లైన్ తరగతుల నిర్వహణపై ఈ క్యాంప్ ఆఫీస్ నుంచే పర్యవేక్షిస్తారు.
ఆర్జీయూకేటీని చక్కదిద్దడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిపెట్టింది. మంత్రి సబితాఇంద్రారెడ్డి, సీఎస్ సోమేశ్కుమార్, విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, ఉన్నతస్థాయి అధికారులు నిత్యం ఆర్జీయూకేటీలో వసతుల కల్పనకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇటీవల మంత్రి కేటీఆర్ కూడా ఆర్జీయూకేటీని సందర్శించి, విద్యార్థుల సమస్యలను తెలుసుకొని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ నేపథ్యంలో ఆర్జీయూకేటీ పర్యవేక్షణకు క్యాంప్ ఆఫీస్ను ఏర్పాటు చేయనుండటం విశేషం.
సాంకేతిక.. సొబగులు
ఆర్జీయూకేటీలో సంస్కరణలకు ఇటీవలికాలంలో పెద్దపీట వేస్తున్నారు. ఇందులో భాగంగా సాంకేతిక సొబగులకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ ఆఫీస్ మేనేజ్మెంట్, హాస్పిటల్ మేనేజ్మెంట్ సిస్టం, హెచ్ఆర్ఎం మేనేజ్మెంట్, సెక్యూరిటీ గేట్ మేనేజ్మెంట్ సిస్టం, సర్వే మేనేజ్మెంట్ సిస్టం, కెరీర్స్ అండ్ రిక్రూట్మెంట్స్, గ్రీవెన్స్ రీడ్రెస్సల్ (ఈ కంప్లయింట్)సెల్, ఎగ్జామ్ మేనేజ్మెంట్ సిస్టం వంటి సాంకేతికతను పటిష్టంగా అమలుచేస్తున్నారు.