హైదరాబాద్, జూలై 5 (నమస్తే తెలంగాణ): టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డిపై టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రేవంత్ బజారు భాష మాట్లాడుతున్నారని, తాచెడ్డ కోతి వనమంతా చెడపాలని చూస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎల్బీనగర్ ఎమ్మెల్యే డీ సుధీర్రెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సోమవారం టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. 2017లో టీడీపీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు రేవంత్రెడ్డి ఎమ్మెల్యే పదవికి ఎందుకు రాజీనామా చేయలేదో చెప్పాలని, ఆ తరువాతనే తమ గురించి మాట్లాడాలని సవాల్ చేశారు. తాత్కాలిక అవసరాల కోసం ప్రజల్ని, పార్టీ కార్యకర్తల్ని హింసవైపు మళ్లిస్తున్నారని, అల్లకల్లోలం సృష్టించాలని చూస్తున్నారని ఆరోపించారు. రేవంత్ పిల్లి శాపాలకు తాము భయపడేది లేదని, ఆ భాష ఉపయోగించడానికి తమకు సంస్కారం అడ్డొస్తున్నదని తెలిపారు. తమవి సేవా రాజకీయాలని, నిరంతరం ప్రజల మధ్యలో ఉంటూ ప్రజలకు సేవచేస్తూ మీడియాకు దూరంగా ఉంటున్నామని చెప్పారు. కానీ రేవంత్ చేస్తున్నవి బ్లాక్మెయిల్, డబ్బు రాజకీయాలని విమర్శించారు. సీఎం కేసీఆర్కు వ్యతిరేకంగా ఎందరెందరో కుట్రలు పన్నుతున్నారని, రేవంత్ అందులో ఒకరని చెప్పారు. కేసీఆర్ను ఎదుర్కోవడమంటే హనుమంతుడి ముందు కుప్పిగంతులు వేయడమేనని అన్నారు. రేవంత్ కంటే తాము ఎక్కువ ఉరికించి కొట్టగలమని హెచ్చరించారు. అయితే గూండాయిజం ద్వారా రాజకీయాలు చేయడాన్ని ప్రజలు ఏనాడూ హర్షించబోరని అన్నారు. ఎంపీగా ఉండి నియోజకవర్గంలో కరోనా మొదటి, రెండో దశలో, వరదలు వచ్చినప్పుడు ఏనాడైనా పర్యటించావా అని సుధీర్రెడ్డి నిలదీశారు. రేవంత్కు ప్రజా సమస్యల పట్ల చిత్తశుద్ధిలేదని, ఉంటే పోరాడాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ మనుగడ సాగించాలంటే ఇలాంటివి చేయవద్దని, రేవంత్లా గూండాలా మాట్లాడితే.. ఆ పార్టీలో గూండాలే మిగులుతారని పేర్కొన్నారు. తెలంగాణ వ్యతిరేకులు రేవంత్ అనే బ్రోకర్ను ప్రోత్సహిస్తున్నారని అన్నారు. ప్రజల హృదయాల్లో ఉన్న కేసీఆర్ను కదిలించడం బ్రోకర్ల వల్ల కాదన్నారు. తెలంగాణ బాగుపడొద్దనే ఎజెండాను రేవంత్ అమలు చేస్తున్నారని ఆరోపించారు.
నాలుగు పార్టీలు మారావు: లింగయ్య
ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ నాలుగు పార్టీలు మారిన రేవంత్కు తమను విమర్శించే అర్హత లేదని అన్నారు. తమను రాళ్లతో కొడితే రేవంత్ను చెప్పుతో కొట్టాలన్నారు. రేవంత్ పిచ్చిపట్టిన వాని లెక్క మాట్లాడుతున్నారని విమర్శించారు. ఉద్యమ సమయంలో చంద్రబాబు పక్కన ఉన్న తెలంగాణ ద్రోహి రేవంత్రెడ్డి అన్నారు. పీసీసీ కమిటీలో నిజమైన కాంగ్రెస్ కనిపించడంలేదన్నారు. రేవంత్రెడ్డి డబ్బులు పెట్టి పీసీసీ కమిటీ వేయించుకున్నారని అన్నారు. ఏదో ఒకరోజు కాంగ్రెస్ కార్యకర్తలే రేవంత్ను చెప్పులతో కొడతారని మండిపడ్డారు.