నిజామాబాద్, అక్టోబర్ 4 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): శ్రీరాంసాగర్ జలాశయానికి పోటెత్తిన వరదతో రికార్డు స్థాయిలో జలవిద్యుదుత్పత్తి జరుగుతున్నది. పోచంపాడ్ జెన్కో కేంద్రంలో సెప్టెంబర్ ఒక్క నెలలోనే 23.72 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి చేసి ఆల్టైం రికార్డు నమోదుచేసింది. ఇటీవల ఎస్సారెస్పీకి భారీ వరద రావడంతో అధికారులు విరామం లేకుండా టర్బయిన్లను నడుపుతున్నారు. నిరంతరంగా నడుస్తున్న జెన్కో కేంద్రంలో విద్యుదుత్పత్తి పెరగడంతో సీజన్లోనే అతి తక్కువ సమయంలో భారీ ఉత్పత్తి సాధ్యమైంది. దీంతో 2021-22 ఏడాదిలో జెన్కో నిర్దేశించుకున్న ఉత్పత్తి లక్ష్యానికి పోచంపాడ్ విద్యుదుత్పత్తి కేంద్రం చేరువయ్యింది. ఆగస్టు, సెప్టెంబర్ రెండు నెలల్లోనే 40 మిలియన్ యూనిట్ల విద్యుత్తును ఉత్పత్తి చేయగా.. అక్టోబర్ నెలాఖరు నాటికి లక్ష్యాన్ని మించిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆర్థిక సంవత్సరం ముగింపు నాటికి 100 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి సాధ్యమయ్యే అవకాశమున్నట్టు టీఎస్ జెన్కో పోచంపాడ్ కేంద్ర డీఈ జే శ్రీనివాస్ వెల్లడించారు.