రాజకీయాలు, విద్య, పత్రికారంగం, భాషా సాహిత్య సాంస్కృతిక రంగాల్లో విశేష సేవలందించిన నూకల నరోత్తమరెడ్డి శతజయంతి సంవత్సరమిది. 1921 మార్చి 27న వరంగల్లు జిల్లా జమాండ్లపల్లిలో జన్మించిన ఆయన అత్యున్నతస్థానాల్లో కీలక బాధ్యతలు నిర్వహించారు. నాడు తెలంగాణవాదాన్ని బలపరిచిన ఆయన వివాదరహితునిగా, సౌమ్యునిగా పేరు తెచ్చుకున్నారు. ఉపరాష్ర్టపతి వెంకయ్యనాయుడు శనివారం హైదరాబాద్లో నరోత్తమరెడ్డి శతజయంతి ఉత్సవాలను ప్రారంభిస్తున్నారు. ఏడాది పొడవునా జర్నలిజం, విద్య, భాషా సాంస్కృతిక, క్రీడా రంగాల్లో కార్యక్రమాల నిర్వహణకు శతజయంత్యుత్సవ సంఘం నిర్ణయించింది.
హైదరాబాద్ చాదర్ఘాట్ హైస్కూల్లో చదివిన నరోత్తమరెడ్డి ఆనాడు మద్రాసు విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న నిజాం కళాశాలలో పట్టభద్రులై తర్వాత రాజనీతిశాస్త్రంలో స్నాతకోత్తర విద్య పూర్తి చేశారు. విద్యార్థి దశలో క్విట్ ఇండియా ఉద్యమంలో పనిచేశారు. పత్రికా రచనపై అభిరుచి కలిగిన నరోత్తమరెడ్డి తెలంగాణ పత్రిక, దక్కన్ క్రానికల్ పత్రికల్లో సేవలందించారు. రాజాబహద్దూర్ వెంకట్రామారెడ్డి సూచనపై సురవరం ప్రతాపరెడ్డి నడుపుతున్న గోలకొండ పత్రికలో చేరి.. ప్రతాపరెడ్డి స్ఫూర్తితో మరిన్ని మెరుగులు దిద్దుకున్నారు. గోలకొండ పత్రిక దినపత్రికగా మారిన తర్వాత సంపాదకులుగా పనిచేశారు. సుమారు రెండు దశాబ్దాల సుదీర్ఘకాలం ఆ పత్రికకు నేతృత్వం వహించి తెలంగాణవాదాన్ని బలపరిచారు.
1956లో హైదరాబాద్ కాంగ్రెస్ కమిటీకి, 1960లో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి అధ్యక్షులుగా వ్యవహరించిన నరోత్తమరెడ్డి 1956-60, 1962-68 మధ్య రాజ్యసభ సభ్యునిగా ఉన్నారు. 1954లో ఆంధ్ర సారస్వత పరిషత్తుకు అధ్యక్షులై మూడు దశాబ్దాలపాటు ఆ పదవిలో కొనసాగారు. తెలుగు నిఘంటువు, విజ్ఞాన దీపికను రూపొందించారు. 1972 నుంచి మూడేండ్లు ఉస్మానియా విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులుగా సేవలందించారు.
-డాక్టర్ జె.చెన్నయ్య
(రేపు నరోత్తమరెడ్డి శతజయంతి ఉత్సవాల ప్రారంభం సందర్భంగా..)