మరింత విస్తరించిన నైరుతి రుతుపవనాలు
నేడు గాలులు, ఉరుములతో వానలు
వర్షాల ప్రభావంతో తగ్గుతున్న ఉష్ణోగ్రతలు
హైదరాబాద్, మే 18 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఈ నెల 22 వరకు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. గురువారం పలు జిల్లాల్లో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తూ, ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పలు ప్రాంతాల్లో కురిసే అవకాశం ఉన్నదని పేర్కొన్నది. ఆగ్నేయ, తూర్పు మధ్య బంగాళాఖాతంలోని పలు ప్రాంతాలకు, అండమాన్ నికోబార్ దీవులకు, మొత్తం అండమాన్ సముద్రంలో నైరుతి రుతుపవనాలు మరింతగా విస్తరించాయని వెల్లడించింది. ఉత్తర-దక్షిణ ద్రోణి మధ్యప్రదేశ్ నుంచి విదర్భ, మరాఠ్వాడ, ఇంటీరియర్ కర్ణాటక మీదుగా అంతర్గత తమిళనాడు వరకు సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉన్నదని పేర్కొన్నది.
20 జిల్లాల్లో మోస్తరు వర్షం
గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 20 జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురిసింది. మహబూబ్నగర్ జిల్లా దేవరకద్రలో అత్యధికంగా 8.11, వికారాబాద్ జిల్లా దోమలో 5.08, నారాయణపేట జిల్లా కృష్ణలో 4.75 సెంటీ మీటర్ల వాన పడినట్టు టీఎస్డీపీఎస్ తెలిపింది. వర్షాల ప్రభావంతో రాష్ట్రంలో క్రమంగా ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయి. బుధవారం పగటి ఉష్ణోగ్రతలు 19 జిల్లాల్లో 40 డిగ్రీలకుపైగా నమోదయ్యాయి. భద్రాద్రి జిల్లా కొత్తగూడెంలో 41.9, జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాలలో 41.5, ఆదిలాబాద్ జిల్లా జైనథ్లో 41.4, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో 41.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి.