హిమాయత్నగర్, మే 13: ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉన్నదని ఆలిండియా జనరల్ ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏఐఐఐఏ) ప్రధాన కార్యదర్శి శ్రీకాం త్ మిశ్రా, ఉపాధ్యక్షుడు కేవీవీఎస్ఎన్ రాజు పేర్కొన్నారు. ఫసల్ బీమా యోజన, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, ఆయుష్మాన్ భారత్ వంటి పథకాలకు అండగా ఉంటున్న నేషనల్, న్యూ ఇండియా, ఓరియంటల్, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీలు ప్రైవేట్పరం కాకుండా పరిరక్షించాలని విజ్ఞప్తి చేశారు. జనరల్ ఇన్సూరెన్స్ నేషనలైజేషన్ 25వ వార్షికోత్సవం సందర్భంగా శుక్రవారం హైదర్గూడలోని ఎన్ఎస్ఎస్లో వారు మీడియాతో మాట్లాడారు. 22 ఏండ్లుగా ప్రైవేట్ కంపెనీల అనైతిక పోటీని తట్టుకొని ప్రభుత్వ సాధారణ బీమా కంపెనీలు 40 శాతానికి పైగా మార్కెట్ షేర్తో అగ్రగామిగా కొనసాగుతున్నాయని తెలిపారు. ప్రభుత్వరంగాన్ని పరిరక్షించాల్సిన కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్ కంపెనీలకు మద్దతు ఇవ్వడం దురదృష్టకరమని పేర్కొన్నారు. సమావేశంలో ఓరియంటల్ ఇన్సూరెన్స్ డిప్యూటీ జీఎం టీ బాలగోపాల్, న్యూ ఇండియా ఇన్సూరెన్స్ సీనియర్ రీజియన్ మేనేజర్ జీ నర్సింహారావు, ప్రతినిధులు శైలజ, నారాయణరావు, సుబ్బారావు పాల్గొన్నారు.