భాషాపండితులకు పదోన్నతులు కల్పించేందుకు అడ్డుగా ఉన్న జీవో -11, 12ను ప్రభుత్వం గతంలోనే సవరించింది. మొత్తం 8,630 భాషాపండితుల పోస్టులను అప్గ్రేడ్ చేస్తూ 2017, 19లలో ఉత్తర్వులు జారీచేయగా, ఈ రెండు జీవోల కారణంగానే పదోన్నతులు కల్పించలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో వీటిని సవరిస్తూ, సర్వీస్ రూల్స్ను మారుస్తూ ఫిబ్రవరి 6న జీవో -2, 3లను జారీచేసింది. వీరికి పదోన్నతులు కల్పించేందుకు షెడ్యూల్ను విడుదల చేయాల్సిన క్రమంలోనే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అడ్డంకిగా నిలిచింది. దీంతో ప్రక్రియకు బ్రేకులు పడ్డాయి. తాజాగా ప్రభుత్వం అనుమతినివ్వడంతో వీరికి సైతం పదోన్నతులు దక్కనున్నాయి.
ప్రమోషన్లు పొందేవారు
పండిట్లు 8,630
పీఈటీలు 1,849
హైదరాబాద్, మార్చి 27 (నమస్తే తెలంగాణ): సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న భాషాపండితులు, పీఈటీల పదోన్నతులకు లైన్ క్లియర్ అయ్యింది. పండిట్, పీఈటీలకు పదోన్నతులు కల్పించేందుకు అనుమతిస్తూ విద్యాశాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి చిత్రా రామచంద్రన్ శనివారం ఉత్తర్వులు జారీచేశారు. ఇందుకు చర్యలు తీసుకోవాలని పాఠశాల విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. దీంతో 8,630 మంది భాషాపండితులు, 1,849 మంది ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లకు పదోన్నతులు లభించనున్నాయి. విద్యాశాఖ అధికారులు జిల్లాలవారీగా ఇప్పటికే పోస్టుల వివరాలను క్రోడీకరించారు. వీలైనంత త్వరగా వీరందరికీ పదోన్నతులు కల్పించేందుకు సీనియార్టీ జాబితాలు తయారుచేసి, షెడ్యూల్ను రూపొందించి పదోన్నతులు కల్పించనున్నారు. ఇప్పటికే భాషాపండితులకు పదోన్నతులు కల్పించేందుకు అడ్డుగా ఉన్న జీవో 11, 12లను సవరించగా, తాజాగా ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లకు ఫిజికల్ డైరెక్టర్లుగా(పీడీ) పదోన్నతులు కల్పించేందుకు అడ్డుగా ఉన్న ఇవే రెండు జీవోలను సైతం సవరించి, సర్వీస్ రూల్స్లో మార్పులు చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. దీంతో పీఈటీ పోస్టులను పీడీలుగా పదోన్నతులు కల్పించేందుకు అడ్డంకులన్నీ తొలగిపోయాయి. ఇప్పటికే అప్గ్రేడ్ చేసిన పోస్టుల్లో పదోన్నతులు కల్పించేందుకు మార్గం సుగమమయ్యింది.
పీఈటీలకే పీడీ పోస్టులు
ప్రభుత్వ, స్థానిక విద్యాసంస్థల్లో పనిచేస్తున్న ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లు (పీఈటీ)లను ఎస్జీటీలుగా పరిగణిస్తున్నారు. వీరంతా ఉన్నత పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్నా పీఈటీలుగానే కొనసాగుతున్నారు. ఫిజికల్ డైరెక్టర్లుగా (పీడీ) పదోన్నతులు పొందేందుకు మిగతా సెకండరీ గ్రేడ్ టీచర్లు (ఎస్జీటీలు) సైతం బీపీఈడీ కోర్సును పూర్తిచేసి పోటీపడుతున్నారు. దీంతో పీఈటీలకు పీడీగా పదోన్నతులు దక్కడంలేదు. న్యాయంగా తమకు దక్కాల్సిన పోస్టులను ఎస్జీటీలు పదోన్నతుల ద్వారా పొందుతుండటంతో తమ పోస్టులను అప్గ్రేడ్ చేయాలని పీఈటీలు గతకొంత కాలంగా కోరుతున్నారు. 2017లో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల్లో భాషాపండితులతో పాటు, పీఈటీల పోస్టులను సైతం అప్గ్రేడ్ చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. తాజాగా ఆయా జీవోలను సవరిస్తూ, సర్వీస్రూల్స్ను మార్పు చేస్తూ విద్యాశాఖ స్పెషల్ సీఎస్ చిత్రా రామచంద్రన్ జీవోలను జారీచేశారు. సర్కారు తీసుకున్న ఈ నిర్ణయంతో పీడీ పోస్టులన్నీ పీఈటీలకే దక్కనున్నాయి.
అందరికీ సమన్యాయం
పండిట్, పీఈటీ పోస్టుల అప్గ్రెడేషన్తో తాము నష్టపోతామని ఎస్జీటీలు ఆందోళన చెందుతున్నారు. అయితే వీరికి న్యాయం చేసేందుకుగాను సర్కారు ప్రాథమిక పాఠశాలలకు హెచ్ఎం పోస్టులను మంజూరుచేస్తూ ఇటీవలే నిర్ణయం తీసుకున్నది. ఇది వరకున్న ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం పోస్టులను మినహాయించి 10వేల పోస్టులకు తగ్గకుండా హెచ్ఎం పోస్టులు మంజూరు చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఎస్జీటీలకు పదోన్నతుల్లో జరుగుతున్న నష్టాన్ని పూడ్చేందుకే ప్రభుత్వం హెచ్ఎం పోస్టులను మంజూరుచేయాలని నిర్ణయం తీసుకున్నది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో భాషాపండితులు, పీఈటీలు, ఎస్జీటీలందరికీ సమన్యాయం జరగనున్నది.
మా కల నెరవేరింది
పీఈటీలుగా చేరిన చాలామంది పీఈటీలుగానే పదవీ విరమణ చేశారని, పీడీగా పదోన్నతి పొందాలనేది కలగానే మిగిలిందని వ్యాయామ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు తునికి విజయ్సాగర్ ఆవేదన వ్యక్తంచేశారు. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ తమ కల నెరవేరడం సంతోషంగా ఉన్నదని చెప్పారు. జీవోలను సవరించడం హర్షణీయమని ఫిజికల్ ఎడ్యుకేషనల్ టీచర్స్ అసోసియేషన్ సలహాదారు డాక్టర్ ఆలేటి బాలరాజు పేర్కొన్నారు.