హైదరాబాద్, అక్టోబర్ 13 (నమస్తే తెలంగాణ) : ఉద్యోగులకు పదోన్నతులు, బదిలీలు చేపట్టాలని తెలంగాణ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం (టీజీవో) ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు గురువారం హైదరాబాద్లోని సెక్రటేరియట్లో సీఎస్ సోమేశ్ కుమార్కు వినతిపత్రం సమర్పించింది. కమర్షియల్ టాక్సెస్, ఎక్సైజ్ శాఖలో పదోన్నతులు పొంది ఏడాదిన్నరగా ఎదురుచూస్తున్నారని వారికి పోస్టింగ్స్ ఇవ్వాలని టీజీవో అధ్యక్షురాలు వీ మమత కోరారు. ఆంధ్రా నుంచి తెలంగాణకు శాశ్వత బదిలీ ప్రక్రియలో స్థానికులనే పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. ఎక్సైజ్ కానిస్టేబుళ్లను హెడ్ కానిస్టేబుళ్లుగా అప్గ్రేడ్ చేయాలన్నారు. జోన్, మల్టీజోన్లో భార్యాభర్తల బదిలీలు జరిగేలా ఉత్తర్వులివ్వాలని విన్నవించారు. ఉద్యోగులు, అధికారులు, పెన్షనర్లకు నగదు రహిత చికిత్సలు అందించడానికి 1 శాతం బేసిక్ పేను చెల్లించాలని చెప్పారు. బకాయిపడ్డ కరువు భత్యాన్ని దీపావళిలోపు విడుదల చేయాలని కోరారు. కార్యక్రమంలో టీజీవో ప్రధాన కార్యదర్శి ఏ సత్యనారాయణ, ఉపాధ్యక్షుడు ఎస్ సహదేవ్, నగర అధ్యక్షుడు జీ వెంకటేశ్వర్లు, హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు ఎంబీ కృష్ణయాదవ్, నాయకులు రాజ్కుమార్ గుప్తా, వీ సుజాత, బీ వెంకటయ్య, టీ లక్ష్మణ్ గౌడ్ పాల్గొన్నారు.