హైదరాబాద్, మార్చి 26 (నమస్తే తెలంగాణ): పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు నిధులు సాధించేందుకు ఆక్సిలరేటెడ్ ఇరిగేషన్ బెనిఫిట్స్ ప్రోగ్రాం (ఏఐబీపీ) కింద ప్రతిపాదనలు రూపొందించాలని అధికారులను నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా ఆదేశించారు. సోమవారం ఆయన పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు, ఎస్ఎల్బీసీ సొరంగం పనులపై సంబంధిత ఈఎన్సీలు, ఎస్ఈలతో సమీక్షించారు. పనులు ఏ మేరకు పూర్తయ్యాయో అడిగి తెలుసుకున్నారు. సొరంగం పనులు ముందుకు సాగకపోవడానికి గల కారణాలను అధికారులు ఈ సందర్భంగా ఆయనకు వివరించారు. దీంతో సాంకేతికంగా ఉన్న అడ్డంకులు, వాటి పరిష్కార మార్గాలపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని రాహుల్ బొజ్జా ఆదేశించారు.