ముత్తారం, జూన్ 27: పెద్దపల్లి జిల్లా మంథని ముత్తారం, రామగిరి, జయశంకర్ భూపాలపల్లి జిల్లా మానేరు పరివాహక ప్రాంతంలో పెద్దపులి సంచారం కలకలం రేపుతున్నది. గత ఏడాది ఇదే సమయంలో ఇక్కడే తిరిగిన పులి.. మళ్లీ ప్రత్యక్షం కావడంతో సమీప గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. శనివారం రాత్రి మంథని నుంచి కాటారం మీదుగా భూపాలపల్లికి వెళ్తున్న ప్రయాణికులకు పులి కనిపించింది. వారిచ్చిన సమాచారంతో పెద్దపల్లి జిల్లా అటవీశాఖ అధికారి శివయ్య సిబ్బందితో కలిసి ఆదివారం మల్హర్ మండలం బస్వాపూర్ అటవీ ప్రాంతంలో గాలించారు. పులి పాదముద్రలు కనిపించినట్టు మంథని రేంజ్ బేగంపేట సెక్షన్ అధికారి నర్సయ్య తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
విజయనగరం జిల్లాలో ఆనవాలు
ఏపీలోని విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం బౌడార, తాటిపూడి కొండను ఆనుకొని ఉన్న అటవీప్రాంతంలో పులి సంచరిస్తున్నది. బౌడార సమీపంలో ఆదివారం రాత్రి రెండు ఆవులపై దాడి చేసిందని స్థానికులు తెలిపారు. అడవిలో కనిపించిన పాదముద్రలు పులివేనని అధికారులు నిర్ధారించారు.