మణికొండ, డిసెంబర్ 26: కురుమలకు ఐదెకరాల స్థలం, భవన నిర్మాణానికి రూ.5 కోట్ల నిధులు విడుదల చేసినందుకు తెలంగాణ ప్రభుత్వాన్ని అభినందిస్తున్నానని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. కోకాపేట సెజ్లో రాష్ట్ర కురుమ సంఘం, హైదరాబాద్ జంట నగరాల కురుమ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం 43వ దసరా, దీపావళి సమ్మేళనం నిర్వహించారు. దీనికి ముఖ్యఅతిధిగా హాజరైన దత్తాత్రేయ.. కురుమలు విద్యారంగంలో రాణిస్తున్నారని, మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. రాష్ట్ర కురుమ సంఘం అధ్యక్షుడు, ఎమ్మెల్సీ యెగ్గె మల్లేశం ప్రతి జిల్లాకు కురుమ సంఘం వసతి గృహాన్ని నిర్మించాలని నిర్ణయం తీసుకోవటం సంతోషకరమని వ్యాఖ్యానించారు. తనవంతుగా కురుమల అభ్యున్నతికి కృషిచేస్తున్నట్టు పేర్కొన్నారు. రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ గత ప్రభుత్వాలు గొల్ల, కురుమలను ఓటుబ్యాంకుగానే చూశాయని, తెలంగాణ ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ కురుమల సంక్షేమానికి అనేక పథకాలను చేపట్టారని అన్నారు. 75 శాతం సబ్సిడీతో మొదటి విడతలో రూ.5వేల కోట్లతో, రెండో విడతలోరూ.6వేల కోట్లతో గొర్రెల పంపిణీ చేపట్టినట్టు తెలిపారు. ఎమ్మెల్సీ యెగ్గె మల్లేశం మాట్లాడుతూ.. కురుమల అభ్యున్నతికి శక్తివంచన లేకుండా పాటుపడుతున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా ముగ్గురు దివ్యాంగ బాలికలకు ల్యాప్టాప్లు అందజేశారు. సమ్మేళనంలో ఏపీ ఎంపీ గోరంట్ల మాధవ్, కర్నాటక మాజీ మంత్రి రేవణ్ణ, రాష్ట్ర భాషాసాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, జవహర్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ మేకల కావ్య, మాజీ హైకోర్టు అడిషనల్ అడ్వకేట్ జనరల్ కేజీ కృష్ణ మూర్తి, కురుమ సంఘం రాష్ట్ర యువజన సంఘం అధ్యక్షుడు తూంకుంట అరుణ్కుమార్, గుడిమల్కాపూర్ కార్పొరేటర్ దేవర కరుణాకర్, రాష్ట్ర కురుమ సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.