సంస్థ్ధాన్ నారాయణపురం, అక్టోబర్ 14: ప్రమాదవశాత్తు తాటి చెట్టుపై మోకు జారడంతో ఒరిగిన ఓ గీత కార్మికుడు 8 గంటలపాటు నరకయాతన పడ్డాడు. ఈ ఘటన నల్లగొండ జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలంలోని శేరిగూడెంలో శుక్రవారం చోటుచేసుకున్నది. శేరిగూడెం గ్రామానికి చెందిన మాసయ్య (57) రోజు మాదిరిగానే ఉదయం తాటి చెట్టుపైకి చేరుకున్నాడు. ప్రమాదవశాత్తు మోకు జారడంతో ఒక్కసారిగా తలకిందులుగా వేలాడాడు.
సుమారు 8 గంటలపాటు అలాగే ఉండిపోయాడు. చుట్టుపక్కల వారు మాసయ్యను కాపాడే ప్రయత్నం చేయగా ఫలితం లేకపోవడంతో పోలీసులకు సమాచారమిచ్చారు. ఏసీపీ ఉదయ్రెడ్డి ఆధ్వర్యంలో క్రేన్ సహాయంతో మాసయ్యను ప్రాణాలతో కిందకు దింపారు. కాపాడిన వారిలో ఎస్సై యుగంధర్ కూడా ఉన్నారు. అనంతరం అతడిని ఓ ప్రైవేట్ దవాఖానలో చేర్పించారు. విషయం తెలుసుకున్న ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ దవాఖాన వైద్యులతో మాట్లాడి మెరుగైన చికిత్స అందించాలని సూచించారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని మంత్రి హామీ ఇచ్చారు.