కోనరావుపేట, మార్చి 10 : బోరులో నీరు అడుగంటిపోవడంతో మరిన్ని పైపులు దించుతుండగా నలుగురు కూలీలు విద్యుత్ షాక్కు గురయ్యారు. అందులో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. రాజన్నసిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలోని బావుసాయిపేట గ్రామానికి చెందిన తిక్కల భూమయ్య తనకున్న ఎకరం పొలంలో వరి సాగు చేశాడు.
పంట గొలక దశకు వస్తుండగా బోరులో నీళ్లు అడుగంటిపోయాయి. దీంతో బోరులో మరిన్ని పైపులను దించాలని ఆదివారం గ్రామానికి చెందిన పంబల్ల భూమయ్య(38), పంబల్ల రాజు, కర్నాల శ్రీనివాస్, కర్నాల మహేశ్ను కూలీకి పిలిచాడు. పొలం పక్కన ఉన్న మరో రైతు బోనాల రాములు సహకారంతో మోటారు పైపులను దించుతున్నారు.
ఈ క్రమంలో బోరు పైపులు హై వోల్టోజీ విద్యుత్ మెయిన్ తీగలకు తగిలి పైపు పట్టుకున్న నలుగురికి విద్యుత్ షాక్ తగిలింది. ఇందులో పంబల్ల భూమయ్య (38) అక్కడికక్కడే మృతి చెందాడు. పంబల్ల రాజుకు కుడిచేయి కాలిపోయింది. మరో ఇద్దరు కర్నాల శ్రీనివాస్, మహేశ్ తీవ్రంగా గాయపడ్డారు. ఇది గమనించిన రైతులు బాధితులను అంబులెన్స్లో వేములవాడ ఏరియా దవాఖానకు తరలించారు.
వేములవాడ ఏరియా దవాఖానలో బాధితులను కరీంనగర్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్, ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ, పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య అరుణ పరామర్శించారు. అనంతరం సిరిసిల్ల ఏరియా దవాఖానలో భూమయ్య మృతదేహాన్ని పరిశీలించి వారి కుటుంబ సభ్యులను మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ ఓదార్చారు. మృతుడి కుటుంబానికి తక్షణ సాయం కింద రూ.5లక్షలు ఇవ్వాలని, సెస్ సంస్థ ద్వారా ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.