హైదరాబాద్, మార్చి 6 (నమస్తే తెలంగాణ): వ్యక్తిగత ప్రయోజనాల కోసం సంఘాన్ని నిర్వీర్యం చేస్తున్న ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరు వెంకట్ను ఆ పదవి నుంచి వెంటనే తొలగించాలని కార్యవర్గం డిమాండ్ చేసింది. ఇటీవల జరిగిన సమావేశంలో ఏఐసీసీ ఇంచార్జి మాణిక్రావు ఠాక్రే, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డికి రాతపూర్వకంగా ఫిర్యాదు చేసింది. సానుకూల నిర్ణయం తీసుకోకుంటే మూకుమ్మడి రాజీనామాలు చేస్తామని ఎన్ఎస్యూఐ కార్యవర్గ సభ్యులు హెచ్చరించారు.
హుజూరాబాద్ నియోజకవర్గ ఇంచార్జిగా, ఎన్ఎస్యూఐ అధ్యక్షుడిగా ఉన్నా అటు నియోజకవర్గ ప్రజలకు, ఇటు సంఘం నాయకులకు, కార్యకర్తలకు అందుబాటులో ఉండటం లేదని పేర్కొన్నారు. ఉదయపూర్ డిక్లరేషన్ ప్రకారం పార్టీ పదవుల్లో ఐదేండ్లకు మించి ఉండరాదని, ఆయన తొమ్మిదేండ్లుగా కొనసాగుతున్నారని గుర్తు చేశారు. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి నాయకత్వ మార్పు లేక విద్యార్థుల్లో ఆకర్షణ కోల్పోయామని తెలిపారు.