గుజరాత్లోని అరవల్లి జిల్లాకు చెందిన ఓ రైతు 1.35 హెక్టార్లలో పల్లి పంట వేశాడు. అకాల వర్షాలతో పంటంతా నష్టపోయాడు. కేంద్రం ఎంతో ఆర్భాటంగా తీసుకొచ్చిన ఫసల్ బీమాతో పరిహారం అందుతుందని, దానితోనైనా కష్టాల నుంచి గట్టెక్కుతానని భావించాడు. కానీ, ఆ రైతన్నకు పరిహారం కింద అందింది కేవలం రూ.100. కంపెనీల అడ్డగోలు నిబంధనలు, క్రాప్ డ్యామేజీ అంచనాలో లోపాలు, ఇన్సూరెన్స్ కంపెనీలపై కేంద్ర ప్రభుత్వ అజమాయిషీ ఉండాల్సినంతగా లేకపోవటమే దీనికి కారణం.
హైదరాబాద్, మే 22 (నమస్తే తెలంగాణ): రైతులపై కక్ష కట్టిన మోదీ సర్కారు.. చేయాల్సిన నష్టం చేస్తూనే ఉన్నది. ఇప్పుడు పంట బీమాను కూడా దూరం చేసింది. ఎన్నో ఏండ్లుగా సవ్యంగా సాగుతున్న నేషనల్ అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ స్కీం(ఎన్ఏఐఎస్)ను పక్కనబెట్టి 2016లో ప్రధానమంత్రి ఫసల్ బీమా పేరుతో కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం కార్పొరేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు తప్ప, రైతులకు కలిగే ప్రయోజనాలు సున్నా అనే అభిప్రాయాలు ఉన్నాయి. పనికిరాని పథకం మాకెందుకని పంజాబ్.. ఈ పథకంలో చేరలేదు. ఇప్పుడు ఇతర రాష్ర్టాలు కూడా బయటికి వచ్చేస్తున్నాయి. ఆ రాష్ర్టాల్లో ప్రధాని సొంత రాష్ట్రం గుజరాత్ కూడా ఉండటం గమనార్హం. రైతుల పొట్ట కొట్టి కార్పొరేట్ కంపెనీలకు దోచిపెట్టే పన్నాగాన్ని పసిగట్టిన తెలంగాణ కూడా ఈ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రీమియం చెల్లింపును నిలిపివేసింది. గుజరాత్లో ఈ పథకం అమలు తీరుపై సెంటర్ ఫర్ ఫైనాన్షియల్ అకౌంటబిలిటీ సంస్థ ఓ సర్వే చేసింది. రైతుల నుంచి ప్రీమియం కట్టించుకొన్న కంపెనీలు పరిహారం చెల్లించలేదని ఈ సర్వేలో తేలింది.
తప్పించుకున్న కేంద్రం.. రాష్ర్టాలపై ఆర్థిక భారం
ఎంతో ఆర్భాటంగా ఫసల్ బీమా పథకాన్ని ప్రవేశపెట్టిన బీజేపీ సర్కారు.. ఆ తర్వాత దాన్నుంచి తప్పించుకొనే ప్రయత్నం చేస్తున్నది. అందులో భాగంగానే ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లింపులో తన వాటాను తగ్గించుకొని, ఆ భారాన్ని రాష్ర్టాలపై మోపింది. కంపెనీలు కోట్ చేసే మొత్తం ప్రీమియంలో రైతులు ఆహార పంటలకు 2 శాతం, వాణిజ్య పంటలకు 5 శాతం ప్రీమియం చెల్లిస్తారు. మిగిలిన ప్రీమియాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 50 శాతం చొప్పున చెల్లించాలి. కానీ ఏడాది కిందట కేంద్రం తన వాటాను తగ్గించుకొన్నది. నీటి వసతి గల ప్రాంతాల్లో 50 నుంచి 25 శాతానికి, నీటి వసతి లేని ప్రాంతాల్లో 30 శాతానికి తగ్గించుకొన్నది. మిగిలిన మొత్తాన్ని రాష్ర్టాల నెత్తిన వేసింది. దీంతో ఈ పథకం రాష్ర్టాలకు ఆర్థిక కష్టాలను తెచ్చి పెట్టింది. దీనికితోడు ఈ పథకంతో ప్రయోజనం అంతంత మాత్రంగానే ఉండటంతో పలు రాష్ర్టాలు ఈ పథకం నుంచి బయటకు వచ్చేశాయి.
చెల్లింపులు అంతంత మాత్రమే
ఫసల్ బీమాతో ప్రయోజనం లేకపోవటంతో రైతులు కూడా ఆసక్తి చూపటం లేదు. దీంతో ఈ పథకంలో రైతుల ఎన్రోల్మెంట్ సంఖ్య, ప్రీమియం చెల్లింపులు ఏటికేడు క్రమంగా తగ్గుతున్నాయి. 2018-19లో దేశవ్యాప్తంగా వానకాలం సీజన్లో 2.16 కోట్ల మంది రైతులు ఎన్రోల్ చేసుకోగా, 2021-22లో ఆ సంఖ్య 1.50 కోట్లకు తగ్గింది. అదే విధంగా ఇన్సూరెన్స్ చేసే మొత్తం కూడా భారీగా తగ్గింది. 2018-19లో రూ.1,23,943. 68 కోట్లకు ప్రీమియం చెల్లించగా, 2021-22లో కేవలం రూ.96,341.43 కోట్లకు ప్రీమియం చెల్లింపు పడిపోయింది. ఇక, రైతులకు నష్ట పరిహారం అందించటంలో ఇన్సూరెన్స్ కంపెనీలు ఆలస్యం చేస్తున్నాయి. పరిహారం ఇవ్వటానికి రెండు, మూడేండ్లు తీసుకొంటున్నాయి. 2017-18లో 90 శాతం చెల్లింపులు చేయగా, 2020-21లో 61 శాతం మాత్రమే చెల్లించాయి. ఈ పథకం అమలు తీరు, నిబంధనలపై కాగ్ అసంతృప్తి వ్యక్తం చేసింది.
ఇన్సూరెన్స్ కంపెనీలకే లాభాలు
రైతును కొట్టి కార్పొరేట్కు పెట్టినట్టుగా ఉన్నదీ పథకం తీరు. ఈ పథకంతో పలు కార్పొరేట్ ఇన్సూరెన్స్ కంపెనీలు వందల కోట్ల లాభాలను ఆర్జించాయి. ఒక్కో కంపెనీ 60-70 శాతం లాభాలు పొందినట్టు పలు కథనాలు వెల్లడయ్యాయి. 2017-18లో ఈ పథకంలో చేరిన ఓ కంపెనీ మూడేండ్లలో ప్రీమియం ద్వారా రూ.1,575.42 కోట్లు సేకరించగా రైతులకు చెల్లించింది.. కేవలం రూ.438.80 కోట్లు. అంటే ఆ కంపెనీ మూడేండ్లలో రూ.1,136.62 కోట్ల లాభం పొందటం గమనార్హం. మరో కంపెనీ ప్రీమియం ద్వారా రూ.6,150.22 కోట్లు తీసుకోగా, రైతులకు చెల్లించింది రూ.2580.56 కోట్లు మాత్రమే. అంటే ఈ కంపెనీ ఏకంగా రూ.3,569.66 కోట్ల లాభాన్ని ఆర్జించింది. ఒక్క తెలంగాణ నుంచే కంపెనీలు పొందిన లాభం రూ.700 కోట్లు.