మోదీతో వ్యక్తిగత విరోధం లేదు
నాకు ప్రధానమంత్రి మోదీతో వ్యక్తిగతంగా ఎలాంటి విరోధం లేదు. మోదీ నాకు మంచి మిత్రుడు. ప్రజల ప్రయోజనాల కోసం, రాష్ర్టాల ప్రయోజనాల కోసం అంతిమంగా దేశ ప్రయోజనాల కోసం తప్పకుండా మీతో సంఘర్షిస్తాం. మీ నిర్ణయాలు ప్రజా వ్యతిరేకం అయినప్పుడు ప్రజల పక్షాన గొంతు ఎత్తుతాం. నా బొందిలో ప్రాణం ఉన్నంత వరకు నేను ఆ పని చేస్తూనే ఉంటా.. అది భారత పౌరుడిగా నా బాధ్యత.
మాటలతో వినకపోతే ఉద్యమాలే
ఇప్పుడు మాటల రూపంలో అడుగుతున్నాం. వింటే మంచి మాట.. లేకుంటే భవిష్యత్తులో చాలా పెద్ద ఎత్తున ఉద్యమాలకు కూడా శ్రీకారం చుడుతాం. రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో కలిసివచ్చే వారందరినీ కలుపుకొని బలీయమైన ఉద్యమాలు చేస్తాం. కేంద్రానికి హెచ్చరికగా తెలియజేస్తున్నా. మీరు ప్రజా విరోధంగా పోతున్నరు. కేంద్ర ప్రభుత్వ విధానాల్లో పరివర్తన రావాలి
మొత్తం 83 కోట్ల ఎకరాల భారతంలో 40 కోట్ల ఎకరాల అద్భుతమైన సాగు భూమి, పుష్కలమైన జల వనరులు ఉన్న ఏకైక దేశం భారత్.. అయినా మనం కంది పప్పు, పామాయిల్ దిగుమతి చేసుకుంటామా? ఇదా కేంద్రం పాలన? ఎంత సిగ్గు చేటు!
– సీఎం కేసీఆర్
పన్నులకు సెస్లు అని పేరు పెట్టి రాష్ర్టాలకు 14 లక్షల కోట్లు ఎగ్గొట్టారు.. ఇదేనా సమాఖ్య స్ఫూర్తి?
అత్యంత కీలకమైన ఆర్మీ నియామక పాలసీని మార్చినప్పుడు సీఎంలతో చర్చించనవసరం లేదా? ఇదేనా సమాఖ్య స్ఫూర్తి?
ఎఫ్ ఆర్బీఎంలో కోతలపై నీతి ఆయోగ్లో ఎందుకు చర్చించరు? ఇదేనా సమాఖ్య స్ఫూర్తి?
దేశానికి సంబంధించిన ముఖ్యమైన పాలసీలపై నీతి ఆయోగ్లో చర్చలు జరుగుతున్నయా? ఇదేనా సమాఖ్య స్ఫూర్తి?
నీతి ఆయోగ్ ఎజెండా రూపకల్పనలో ఎవరికీ భాగస్వామ్యం లేదు.. ఇదేనా సమాఖ్య స్ఫూర్తి?
కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు రాష్ర్టాల ప్రగతికి గొడ్డలిపెట్టుగా మారాయి.. ఇదేనా సమాఖ్య స్ఫూర్తి?
దేశంలో ఏకస్వామ్య పార్టీ వ్యవస్థను తీసుకొస్తమంటరు. ఏక్నాథ్ షిండేలను సృష్టిస్తమంటరు.. ఇదేనా సమాఖ్య స్ఫూర్తి?
ఎఫ్ ఆర్బీఎంలో కోతలపై నీతి ఆయోగ్లో ఎందుకు చర్చించరు? ఇదేనా సమాఖ్య స్ఫూర్తి?
దేశానికి సంబంధించిన ముఖ్యమైన పాలసీలపై నీతి ఆయోగ్లో చర్చలు జరుగుతున్నయా? ఇదేనా సమాఖ్య స్ఫూర్తి?
నీతి ఆయోగ్ ఎజెండా రూపకల్పనలో ఎవరికీ భాగస్వామ్యం లేదు.. ఇదేనా సమాఖ్య స్ఫూర్తి?
కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు రాష్ర్టాల ప్రగతికి గొడ్డలిపెట్టుగా మారాయి.. ఇదేనా సమాఖ్య స్ఫూర్తి?
దేశంలో ఏకస్వామ్య పార్టీ వ్యవస్థను తీసుకొస్తమంటరు. ఏక్నాథ్ షిండేలను సృష్టిస్తమంటరు .. ఇదేనా సమాఖ్య స్ఫూర్తి?
హైదరాబాద్, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ): నీతి ఆయోగ్ సమావేశం.. ఓ భజన మండలి అని, అక్కడ ఎంత మొత్తుకున్నా కంఠశోష తప్ప.. నయా పైసా లాభం లేదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అన్నారు. ఆదివారం ఢిల్లీలో జరుగనున్న నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్టు స్పష్టం చేశారు. ఇందులో రాజకీయ కారణాలేమీ లేవని ఎంతో ఆవేదన, బాధతోనే బహిష్కరించాలని నిర్ణయం తీసుకొన్నట్టు తెలిపారు. ప్రణాళికాసంఘం స్థానే నీతి ఆయోగ్ను నెలకొల్పిన సందర్భంలో మోదీ చెప్పిన ఏ ఒక్క మాటలోనూ నిజం లేదని మండిపడ్డారు. శనివారం ప్రగతిభవన్లో మీడియా సమావేశంలో కేంద్ర తీరుపై, నీతి ఆయోగ్ వైఫల్యంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నీతి ఆయోగ్ సమావేశ బహిష్కరణకు గల కారణాలతో ప్రధాని మోదీకి లేఖ రాశారు. సీఎం కేసీఆర్ ప్రసంగం ఆయన మాటల్లోనే..
ఆవేదనతోనే బహిష్కరణ
నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నానంటే ఏదో రాజకీయం కారణంతో కానే కాదు.. ఇందుకు ఎన్నో కారణాలున్నాయి. వాస్తవమైన విషయాన్ని చాలా బాధతో, దుఃఖంతో చెప్తున్నా. ఇంత పెద్ద సువిశాల భారతదేశంలో 140 కోట్ల జనాభాగల దేశంలో కేంద్రం ఇంత నిర్లక్ష్యంగా, ఇష్టానుసారంగా చేసుకుంటూపోవడం ఏమిటి? 8 ఏండ్ల నీతి ఆయోగ్ ఫలితం, ప్రగతి దేశంలో ఏం కనిపిస్తున్నది? ధరలు అదుపులో ఉండవు, ద్రవ్యోల్బణం అదుపులో ఉండదు, రూపాయి పతనం కంట్రోల్ కాదు. నిరుద్యోగం పెరుగుతది, రైతుల ఆక్రందనలు, కార్మికుల హాహాకారాలు పెరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో నీతి ఆయోగ్ సమావేశానికి వెళ్లి చెప్తే అరణ్య రోదనగానే మిగులుతుంది. కంఠశోష తప్ప ఏం లాభం ఉండదు. చెవిటోని ముందు శంఖం ఊదినట్టే. ఏమైనా లాభం జరిగేదుంటే వెళ్లి మాట్లాడినా అర్థం తాత్పర్యం ఉంటుంది. చెప్పి చెప్పి చెప్పి తకాయించిపోయి ఠంగైపోయి బాయ్కాట్ చేయడమే కరెక్ట్ అని అనుకున్నం. వచ్చేది లేదు పోయేది లేదు అంతా ఒట్టిదే. ‘మా ముఖ్యమంత్రి నీతిఆయోగ్ మీటింగ్కు పోయిండట.. మాకేమైన వస్తదేమో’నని ఇక్కడి జనం అనుకుంటరు. పొయిరాను ఖర్చులు తప్ప వచ్చేది మన్ను.
ఆర్మీ పాలసీ మార్పుపై అడిగారా?
దేశంలో కీలకమైనది రక్షణ రంగం. ఆర్మీ పాలసీని మార్చారు. రాష్ర్టాల ముఖ్యమంత్రులను పిలిచి, ఆర్మీ సర్వీసును మార్చుతున్నామని ఒక్కమాటయినా చెప్పారా? ఒక్క ముఖ్యమంత్రితోనైనా చర్చించారా? ఆర్మీ పాలసీ మార్పుపై ఇప్పటికైనా చర్చ ఉన్నదా? అసలు పెడతరా? ఉన్న ప్లానింగ్ కమిషన్ను తీసేసి నీతి ఆయోగ్ తెచ్చారు. అందులో ఏదన్న ముఖ్యమైన పాలసీపై చర్చలు సాగుతున్నాయా? ఇదా సమాఖ్య స్ఫూర్తి. ఇది కో ఆపరేటివ్ ఫెడరలిజమా? నియంతృత్వమా? దీనిని ఏమనుకోవాలి? అదో భజనమండలి. సీఎం స్థాయి వ్యక్తులకు కూడా ఇన్నే నిమిషాలు మాట్లాడాలని షరతు పెడతరు. సమయం దాటితే బెల్లు కొడతా ఉంటరు. ఎవరైనా ఓ 2 నిమిషాలు ఎక్కువ మాట్లాడితే మిగతా వాళ్లు నవ్వుతుంటరు. ఇంత గందరగోళంగా నిర్వహించే బదులు అందరూ అవసరమైన విధంగా మాట్లాడేలా నీతి ఆయోగ్ మీటింగ్ను 2 రోజులు కాకుంటే 4 రోజులు పెట్టాలె. ఇంతకన్నా ముఖ్యమైన, పెద్ద పనేమున్నది. ఇదో పరిహాసాస్పదంగా మారింది. నాకు బాధేసి ఇవన్నీ చెప్తున్నా.
ప్లానింగ్ కమిషన్ ఉన్నప్పుడు రాష్ర్టాల బడ్జెట్ అమలుకోసం పోతే.. రాష్ర్టాల ఆర్థికశాఖ మంత్రులు, కార్యదర్శులు, అవసరమైతే ముఖ్యమంత్రులు ఢిల్లీకి వెళ్లి వారం వారం రోజులు ఉండి.. ప్రణాళికా సంఘం వద్ద కూర్చొని చర్చలు జరిపేవారు. ప్రణాళికా సంఘం ఏమైనా తప్పు అంచనాలు వేస్తే.. వాస్తవ పరిస్థితులను, తమ ప్రాధాన్యతలను చెప్పి వాదించి ఒప్పించి నిధులు కేటాయించుకొనే వాళ్లం. అంతలా వెసులుబాటు ఉండేది. నీతిఆయోగ్ తనకు తానుగా చేసిన సిఫార్సులకైనా గౌరవం ఉంటుందా? అదీ లేదు. నీతిఆయోగ్ ఎజెండా రూపకల్పనలో కో-ఆపరేటివ్ ఫెడరిలిజాన్ని కాకి ఎత్తుకుపోయింది. నీతి ఆయోగ్ ఎజెండా రూపకల్పనలో ఎవరికీ భాగస్వామ్యం లేదు. దీన్ని ఎవరు తయారు చేస్తారో? ఎక్కడ తయారు చేస్తారో? ఎవరికీ తెలియదు. ప్రముఖ సమస్యలు ఏమున్నాయి? నిత్యావసర ధరలు ఎందుకు పెరుగుతున్నాయి? ద్రవ్యోల్బణం ఎందుకు పెరుగుతున్నది? రూపాయి విలువ ఎందుకు అంతకంతకు పడిపోతున్నది? ఈ సమస్యల పరిష్కారానికి మనందరం కలిసి ఏం చేద్దామనే ముచ్చట అసలే లేదు. ఇది చిల్లర రాజకీయం అసలే కాదు. దేశ ప్రజలకు నిజాలు తెలియాలనే ఇవన్నీ ఆవేదనతో చెప్తున్నా. రోజు రోజుకూ దేశ భవిష్యత్తు ప్రమాదంలో పడుతున్నది.
లెక్కలతో సహా చెప్పిన..
మూర్ఖ శిఖామణులు తాము కూర్చున్న కొమ్మను తెలివి తక్కువై తామే నరుక్కుంటరన్నట్టు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు రాష్ర్టాల ప్రగతిని దెబ్బతీస్తున్నాయి. నీతి ఆయోగ్ తొలి సమావేశం నుంచి మొదలుకొంటే ప్రతి సమావేశంలో నేను నొక్కి వక్కాణించిన. ‘ఈ దేశంలో ఏ మూలన జరిగే అభివృద్ధిని ఆపినా అది ఈ దేశ ప్రగతికి గొడ్డలిపెట్టు, తెలివి తక్కువతనమైతది. బాగా దూసుకుపోతున్న, నైపుణ్యంతో పని చేస్తున్న రాష్ర్టాలకు కాళ్లల్లో కట్టెలు పెట్టకండి. వాళ్లకు ప్రోత్సాహకాలను తగ్గించకండి. పెంచండి. తద్వారా దేశం బాగుపడుతుంది’ అని చెప్పిన. ఒక సమావేశంలో ఎక్కువ సమయం తీసుకొని చాలా విషయాలు బలంగా చెప్పిన. ఈ విషయాలను రికార్డు చేయాలని కోరిన. తెలంగాణ గురించి చెప్తూ మొత్తం దేశం గురించి కూడా చెప్పాను. దేశంలో 24 గంటల కరెంట్ ఎట్లా ఇవ్వచ్చో, ప్రతి ఎకరాకు సాగునీరు ఎలా ఇవ్వచ్చో లెక్కలతో సహా చెప్పా ను. సమావేశం అనంతరం 15-16 రాష్ర్టాల చీఫ్ సెక్రటరీలు నా దగ్గరకు వచ్చి దేశం గురించి అద్భుతంగా చె ప్పారని అభినందించారు. ఆ స్ఫూర్తిని మేం ప్రదర్శించినం.
బక్కెట్ నీళ్ల కోసం మద్రాసు ఎందుకు పరితపిస్తున్నది?
నీళ్ల విషయంలో ఓ బిల్లును తెస్తే.. ఆనాడు నీతి ఆయోగ్ సమావేశంలో నేను ఏదైతే చెప్పానో.. ఇప్పుడున్న లోక్సభపక్ష నేత నామా నాగేశ్వర్రావుతో కూడా పార్లమెంట్లో అదే మాట్లాడిచ్చాను. చారిత్రక నగరం మద్రాసు ఒక్క బకెట్ నీళ్ల కోసం ఎందుకు పరితపిస్తున్నది? 70 వేల టీఎంసీలు నీళ్లున్న దేశంలో ఒక్క బకెట్ నీళ్ల కోసం పరితపించొచ్చా? అక్కడి సినిమా డైరెక్టర్ ‘తన్నీర్-తన్నీర్’ అనే సినిమా తీసే అవసరం ఎందుకొచ్చింది? ఈ దుస్థితి నుంచి విముక్తి లేదా? అని చెప్పిన. నల్లగొండ జిల్లాలో ఫ్లోరైడ్తో రెండు లక్షల మంది బిడ్డల నడుములు వంగిపోతే పట్టించుకొన్న నాథుడు లేడు. ఇదే ఎన్డీఏ ప్రభుత్వ అధినేత అయిన వాజ్పేయి ప్రధాన మంత్రిగా ఉన్నారు. వీళ్లను తీసుకెళ్లి ఆయన టేబుల్పై పడుకోబెట్టారు. చివరికి తెలంగాణ వచ్చి ఆ సమస్యను తీర్చేంతవరకు కూడా దిక్కులేకుండా పోయింది. ఇది మంచిది కాదు దేశానికి. తీవ్రమైన సంక్షోభం ఏర్పడుతున్నది, లక్షల మంది బతుకులు పోతుంటే కూడా పట్టించుకోకుంటే అర్థం ఉండదని చెప్పిన. ఈ విషయాలను నీతి ఆయోగ్ ప్రతి విషయంలోనూ చెప్పిన. నా మాటల్ని నీతి ఆయోగ్ మినిట్స్లోనూ రాయాలని చెప్పిన. కేంద్ర ప్రభుత్వం ముందు, ప్రధాని ముందు, అన్ని రాష్ర్టాల ముఖ్యమంత్రులు, ప్రధాన కార్యదర్శుల సాక్షిగా ఈ విషయాలు చెప్పిన. అప్పటి హోంమంత్రి రాజ్నాథ్సింగ్ నా వద్దకు వచ్చి‘మంచి విషయాలు, చాలా అద్భుతంగా చెప్పారు’ అని ప్రశంసించారు.
నాడు ప్రణాళికాబద్ధమైన ప్రగతి కోసం..
దేశానికి స్వతంత్రం రావాలని పోరాటం చేసిన రోజుల్లో ఒకానొక సందర్భంలో నేతాజీ సుభాష్చంద్రబోస్ కాంగ్రెస్ సారథ్యం వహించే సమయంలో.. దేశానికి స్వతంత్రం వస్తే ఏం చేయాలి? ఈ దేశాన్ని మనం ఎట్లా ముందుకు తీసుకుపోవాలె అని దేశంలో ఏం జరగాలె? అనే చర్చలు జరిగాయి. ది గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా దాదాబాయి నౌరోజీ భాగస్వామ్యం వహించారు. స్వాతంత్య్రం రావటానికి పూర్వం కూడా కొంతమంది ‘మనకు ఇప్పుడే స్వతంత్రం అవసరం లేదు. బ్రిటిష్వాళ్లు బాగానే డెవలప్ చేస్తున్నరు. అని అన్నరు. తెలంగాణ ఏర్పాటు సమయంలోనూ కొంతమంది సన్నాసులు అట్లే మాట్లాడిన్రు. ఇదెప్పుడు కూడా చరిత్రలో మనకు కనిపించిందే. ఏ దేశమైనా సరే.. ఏ సమాజమైనా సరే.. ఒక ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలె. అది స్వల్పకాలిక.. మధ్యకాలిక.. దీర్ఘకాలిక ప్రణాళికలు అయి ఉండాలె. అనే ఉద్దేశంతోని ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది ఉండాలని నిర్ణయానికి వచ్చినారు.
వార్షిక ప్రణాళికలు, పంచవర్ష ప్రణాళికలు.. తద్వారా రెండు మూడు దశాబ్దాల విజన్ కలిగి ఉండాలనే పద్ధతుల్లో ఆలోచనలు జరిగినయి. నెహ్రూ ప్రధాని అయిన తరువాత ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియా ఉనికిలోకి వచ్చింది. ఈ దేశ ప్రగతి.. దేశంలో మనం చూస్తున్న ప్రాజెక్టులు..పరిశ్రమలు కావచ్చు పోర్టులు కావచ్చు..ఎయిర్పోర్టులు కావచ్చు..జీవితబీమా సంస్థ ఎల్ఐసీ లాంటి సంస్థ కావచ్చు. ఇండియన్ రైల్వేస్ ఇట్లా అనేక విషయాలు మనకు ఈ రోజు దేశంలో కనపడతావున్నాయి. ఎందరో మహానుభావులు అందులో సభ్యులుగా ఉండేవారు. వారంటే ఎంతో గౌరవం ఉండేది. జాతీయ అంతర్జాతీయ స్థాయి ఆర్థికవేత్తలు, వివిధ రంగాల శాస్త్రజ్ఞులు.. నిష్ణాతులు వారి సూచనలు ఇతర దేశాల్లో ప్రణాళికల అమలు, పరిణామాలను విశ్లేషించి మన వాతావరణానికి, మన దేశంలో పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకొనేవారు.
నీతి ఆయోగ్ నిష్క్రియాపర్వం
2014లో యూపీఏ ప్రభుత్వం ఓడిపోయి భారతీయ జనతాపార్టీ ప్రభుత్వం నరేంద్రమోదీ నాయకత్వంలో వచ్చింది. నీతి ఆయోగ్ అని తెచ్చినారు. నీతి ఆయోగ్ అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. భారతదేశాన్ని సమూలంగా మార్చివేయటానికి జాతీయ స్థాయి సంస్థ అని అంటున్నం. ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియాకు ప్రత్యామ్నాయంగా చేస్తున్నామని చెప్పిన్రు. దీంట్లో మేము కో-ఆపరేటివ్ ఫెడరలిజాన్ని చొప్పిస్తున్నం..ఆచరించి చూపిస్తాం అట్లాగే ముఖ్యమంత్రులు అందరూ ఇందులో సభ్యత్వం తీసుకుందాం. దీనిని టీమ్ ఇండియా అని పిలుస్తానని ప్రధానమంత్రి స్వయంగా చెప్పినారు. ఆ సమావేశంలో నేను కూడా ఉన్న. నేను కూడా చాలా ఆశపడ్డ నిజంగానే దేశానికి మంచిరోజులు వచ్చాయి అనుకున్న. కో-ఆపరేటివ్ ఫెడరలిజం అంటే సహకార సమాఖ్య స్ఫూర్తి. ఇప్పటిదాకా ఫెడరల్ ఫ్లేవర్ లేదు దేశంలో మేం తెస్తం అని చెప్పినాడు. అట్లాగే ముఖ్యమంత్రులందరినీ సభ్యులను జేసినం కాబట్టి ఒక టీమ్ స్పిరిట్తో పనిజేద్దాం అని చెప్తే చాలా సంతోషపడ్డం. నేను కూడా చాలా ఆశించిన. ఇన్నేండ్లు కొట్లాడి తెలంగాణ తెచ్చుకొన్నందుకు మంచిరోజులు వచ్చినవని మంచి జరిగే అవకాశమున్నదని, గతంలో కంటే మంచి జరుగుతదని ఆశపడటం సహజం కదా.. దురదృష్టవశాత్తు అదొక నిరర్థక సంస్థగా మారిపోయింది. నీతి ఆయోగ్ అనేది నేమ్సేక్ ఇన్స్టిట్యూషన్. ఒక నిష్క్రియా పరమైనటువంటి మేధోమథనాన్ని బందుపెట్టి.. ప్రధానమంత్రితో, లేక ఇంకెవలో చెప్తే, తయారుచేసే భజనమండలిగా మారింది. చాలా దురదృష్టకరం.
పీపీఏసీ నిబంధనల ప్రకారమే నిధులు
నేను 1985లో శాసనసభ్యుడిగా అయిన. అప్పుడు ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉండేవారు. సిద్దిపేటలో కాళ్లకుంట కాలనీ ఉన్నది. దానికి భూసేకరణ కోసం డబ్బు కావాలని అంటే.. నా మాట మన్నించి ఒక 8 లక్షలు మంజూరు చేసిన్రు. ముఖ్యమంత్రిగా వారు మంజూరు చేసినప్పటికీ మళ్లీ ఓ కమిటీకి వెళ్లింది అది. ఆ కమిటీ పేరు పీపీఏసీ (ప్లాన్డ్ ప్రాజెక్ట్ అప్రూవల్ కమిటీ) ఉండేది. దానికి చీఫ్ సెక్రటరీ చైర్మన్గా.. ఫైనాన్స్ సెక్రటరీ, సంబంధిత శాఖ కార్యదర్శి, ప్లానింగ్ కార్యదర్శి సభ్యులుగా ఉండేవారు. రూ.5 లక్షలకు మించిన ఏం మంజూరైనా సరే పీపీఏసీ క్లియర్ చేస్తేనే దానికి అనుమతులు లభించేది. ప్రజాధనం కాబట్టి ప్రతి రూపాయి కచ్చితంగా సద్వినియోగం జరగాలె. సామాజికాభివృద్ధికి.. దేశాభివృద్ధికి.. రాష్ర్టాభివృద్ధికి తోడ్పడాలనే ఒక స్ఫూర్తి కనపడేది. అభివృద్ధిని ప్రగతిని ప్రజల ప్రయోజనాలను విశాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని గతంలో వ్యవహారాలు జరుగుతుండె. అదంతా దేశం చూసింది. ఈ విషయాలు అందరికీ తెలిసిందే.
అన్ని రంగాల్లో దేశం సర్వనాశనమైంది..
మేం చెప్పిందే చెయ్యాలె లేకపోతే మీ కథ చూస్తాం అన్నకాడికి వచ్చింది. కో-ఆపరేటివ్ ఫెడరలిజం పొయ్యింది..ఇంపరేటివ్ డిక్టేటరిజం వచ్చింది. చివరకు ఎక్కడికి వచ్చిందంటే ముఖ్యమంత్రులే బుల్డోజర్లు పెట్టి మీ ఇండ్లు కూలగొడతాం అనేకాడికి పరిస్థితి వచ్చింది. రాష్ట్రంలో మంత్రులుగా ఉండే వాళ్లు ఎన్కౌంటర్లు చేయడానికి కూడా వెనుకాడమనే కాడికి పరిస్థితి వచ్చింది. భగవంతుడి పేరుపైన దేశ రాజధానిలో జరిగే ఉత్సవాల్లో కత్తులు పట్టుకుని తిరిగే పరిస్థితి. కత్తులు కటార్లు పట్టుకుని తిరిగే పరిస్థితి ఏర్పడింది. గత హనుమాన్ జయంతి ఉత్సవాల సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీ నడిబొడ్డున పట్టపగలు కత్తులు పట్టుకొని స్వైర విహారం చేశారు. ఇదేనా దేశానికి కేంద్ర ప్రభుత్వం, నీతి ఆయోగ్ ఇచ్చిన సందేశం? ఈ దేశంలో ఏం జరుగుతున్నది? అన్ని రంగాల్లో దేశం సర్వనాశనం అయిపోయింది. ఇండియా చాలా బ్యాక్వర్డ్ అయింది. అంతర్జాతీయ విపణిలో మన పరువుపోతున్నది. ఆర్థికవేత్తలు రఘురామ్ రాజన్, కౌశిక్బసు ఎంతో మంది పెద్దలు ప్రతిరోజు హెచ్చరిస్తూనే ఉన్నారు. కేంద్రానికి లేఖలు రాస్తున్నారు. అయినా ప్రధాని ఒక్కర్ని కూడా పిలిచింది లేదు, మాట్లాడింది లేదు.
నిరర్ధకంగా నీతి ఆయోగ్
ప్రణాళికా సంఘం స్థానంలో కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన నీతి ఆయోగ్ నిరర్ధక సంస్థగా మారిపోయిందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అన్నారు. సంస్థ దేశానికి గొప్పగా ఏదో చేస్తదని ఊహించామని, కానీ, గతంతో పోలిస్తే దేశంలో అన్ని అంశాల్లో పరిస్థితి మరింత దిగజారిందని ఆవేదన వ్యక్తంచేశారు. నీతి ఆయోగ్ సిఫారసులకు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న గౌరవం సున్నా అని ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘నీతి ఆయోగ్ ప్రతిపాదనలన్నీ మోదీ సర్కారు బుట్టదాఖలు చేస్తున్నది. అలాంటప్పుడు ఆ సంస్థకు ఏం విలువ ఉన్నట్టు? కేంద్ర ప్రభుత్వం నీతిఆయోగ్ను అవమానించినట్టే కదా?’ అని ప్రశ్నించారు. ఎన్డీఏ ప్రభుత్వం ఈ ఎనిమిదేండ్లలో ఏ ఒక్క వాగ్దానాన్ని నెరవేర్చలేదని విమర్శించారు. సీఎం శనివారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ దేశంలో పరిస్థితులు గతంలో ఎన్నడూ లేనంతగా దిగజారాయని దుయ్యబట్టారు. సీఎం అభిప్రాయాలు ఆయన మాటల్లోనే…
నీతి ఆయోగ్ సృష్టి పెద్ద జోక్గా మారింది
గతంలో ప్లానింగ్ కమిషన్కు ఒక నిర్దిష్టమైన పని విధానం ఉండేది. ప్లానింగ్ కమిషన్ ఏం చేయాలి? ఏం చేయకూడదు? అనే స్పష్టత ఉండేది. రాష్ర్టాల బడ్జెట్ల రూపకల్పనలో కూడా పాత్ర వహించేది. మార్గదర్శనం చేసేది. కానీ, ఇప్పుడు నీతి ఆయోగ్ ఆ పాత్ర నిర్వహించడం లేదు. నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉంటదో..నీతి ఆయోగ్లో నీతి అంత అన్నట్టుగా పరిస్థితి మారింది. నీతి ఆయోగ్ను ఏర్పాటు చేసిన ఎనిమిదేండ్ల తర్వాత దేశంలో ఏం కనిపిస్తున్నది? ప్రధాని మోదీ వాగ్దానాలు, నీతి ఆయోగ్ సృష్టి.. వీటన్నింటి ఆచరణ పెద్ద జోక్గా మారింది. దేశంలో ఎప్పుడూ లేని దురవస్థ ఇప్పుడు కనిపిస్తున్నది. నానాటికీ పరిస్థితులు దిగజారుతున్నాయి. అంతులేకుండా పెంచబడుతున్న ద్వేషం.. విద్వేషం.. అసహనం వంటి వాటితో దౌర్భాగ్య పరిస్థితులు ఏర్పడుతున్నాయి. దేశ చరిత్రలోనే తొలిసారి రైతాంగం మొత్తం 13 నెలల పాటు రాజధానిలో సమ్మెలు చేసింది. అందులో దాదాపు 800 మంది రైతులు చనిపోయారు. చివరకు ప్రధాన మంత్రే స్వయంగా క్షమాపణ చెప్పి చట్టాలు వాపస్ తీసుకున్నారు. ఇవన్నీ విమర్శలు కావు. ప్రపంచం సాక్షిగా, భారతదేశం సాక్షిగా జరిగిన సత్యాలు. అంటే దేశంలో పరిస్థితి మెరుగైనట్టా? ఇంకా దిగజారినట్టా? మేధోసంపత్తి దేశంలో పెరిగినట్టా? సమస్యల పరిష్కారం పట్ల ధృక్పథంలో మార్పు వచ్చినట్టా? దీనికి 13 నెలలు ఎందుకు? 13 రోజుల్లో నిర్ణయం తీసుకోవచ్చు కదా? ఈ దుస్థితి మనం కండ్లారా చూస్తున్నాం..
దేశంలో చర్చకోసమే ఈ ప్రొటెస్ట్
నీతి ఆయోగ్ సమావేశాలకు పోతే నాలుగు నిమిషాలు మాట్లాడాలి. నాలుగు గంటలు ఆ పల్లి కాయలు, కాజు పలుకులు తినుకుంటూ కూసోవాలి. అక్కడికి పోయి ఆ నాలుగు నిమిషాలు చెబితే ప్రభావం పడదు. కనీసం ప్రొటెస్ట్ చేస్తేనైనా ఎందుకు తెలంగాణ ముఖ్యమంత్రి ప్రొటెస్ట్ చేసిండు అని దేశం అంతా చర్చిస్తారు. చర్చ జరగాలే. అదే నాకు కావాలి. ప్రధానికి, కేంద్ర ప్రభుత్వానికి నా మీద కోపం రావొచ్చు.. నో ప్రాబ్లమ్. ఇది డెమోక్రసీ.. నాకు హక్కుంది. ఉత్తరంలో ఈ విషయాలను క్లియర్గా రాశా. సమావేశానికి వచ్చినా ఉపయోగం లేదనే నా నిరసన తెలియజేస్తున్నా. ఇప్పటికైనా మీ పద్ధతులు మార్చాలని కోరుతూ లెటర్ రాశా. ఊరికే తమాషా కోసం చేయడం లేదు.
రూ.14 లక్షల కోట్లు ఎగ్గొట్టిన కేంద్రం
పన్నులు వసూలు చేసే పద్ధతుల్లో రాజ్యాంగం కొన్ని బాధ్యతలు నిర్దేశించింది. కేంద్రం వసూలు చేసే పన్నులేమిటి? రాష్ర్టాలు వసూలు చేసే పన్నులేమిటి? అంశాలపై ఎవరి బాధ్యతలు వారికి స్పష్టంగా పేర్కొన్నారు. కొన్ని రకాల పన్నుల్లో రాష్ర్టాలకు వాటా కూడా ఇవ్వాలి. ఇది రాష్ర్టాలకు రాజ్యాంగబద్దమైన హక్కు. మాన్య ప్రధానమంత్రి నరేంద్రమోదీ మోధో సంపత్తితో ఈ నీతి ఆయోగ్ సృజన ఏం చేస్తున్నది? రాష్ర్టాల పన్నుల వాటా ఎంత తెలివిగా ఎగ్గొట్టొచ్చనే ఆలోచన చేసి ట్యాక్స్లకు సెస్ అనే పేరు పెట్టి రాష్ర్టాలకు రావాల్సిన దాదాపు రూ. 13 నుంచి రూ.14 లక్షల కోట్లను ఎగ్గొట్టారు. ఇదేనా సహకార సమాఖ్య స్ఫూర్తి? రాజ్యాంగబద్ధంగా రాష్ర్టాలకు సంక్రమించాల్సిన హక్కులకు ఒక ట్విస్ట్ ఇచ్చి రాష్ర్టాలకు దక్కాల్సిన నిధులను కొల్లగొడుతారా? ఇది ధర్మమేనా? దీన్నే కో-ఆపరేటివ్ ఫెడరలిజం అంటారా? ఇదే టీం ఇండియా చేసే పనేనా? ఏ నీతి ఆయోగ్ సమావేశాల్లో అయినా దీనిపై చర్చ పెడతారా.? చర్చకు ఆస్కారం ఉంటదా?
శుష్క ప్రియాలు.. శూన్య హస్తాలు
కేంద్ర విధానం చూస్తుంటే శష్క ప్రియాలు శూన్య హస్తాల మాదిరిగా ఉంది. తెలంగాణకు వచ్చిన కేంద్ర బృందాలేమో ఆహా తెలంగాణ, ఓహో తెలంగాణ, మీ భగీరథ బాగున్నది.. ఇది బాగున్నది, అది బాగున్నది అని పొగిడిపోవడం తప్ప ఇచ్చిందేమీ లేదు. రాష్ర్టానికి వచ్చిన ప్రతి బృందం పొగిడి పోవడమే. పంచాయతీరాజ్లో 10 గ్రామాలకు అవార్డులు వస్తే పదికి పది అవార్డులను తెలంగాణకే ఇస్తరు. 20 గ్రామాలకు ఇస్తే ఇందులో 19 తెలంగాణ గ్రామాలకే ఇస్తరు. తెలంగాణలో కేంద్ర ప్రభుత్వ అవార్డులు, నీతి ఆయోగ్ ప్రశంసలు అందుకోని డిపార్ట్మెంటే లేదు. ఇలా శుష్క ప్రియాలు, శూన్య హస్తాలే తప్పా ఒక్క రూపాయి కూడా ఇచ్చింది లేదు. రాష్ర్టానికి రూ.6 వేల కోట్ల గ్రాంట్ ఇవ్వాలని 15వ ఆర్థికసంఘం ప్రత్యేకంగా కేంద్రానికి సిఫార్సు చేసింది. 6 పైసలు కూడా ఇవ్వలేదు. మనకు రావాల్సిన జీఎస్టీ బకాయిలు కూడా పెండింగ్లో పెడుతున్నరు. ఇప్పటికీ కూడా రాష్ర్టానికి కేంద్రం రూ.3,200 కోట్ల బకాయిలు ఉన్నది.
ఉపాధి హామీ పథకాన్ని ఎత్తేసే కుట్ర
ఎనిమిదేండ్ల పాలనలో మోదీ సర్కారు ఏ ఒక్క వాగ్దానం నెరవేర్చలేదు. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్నారు. కానీ, పెట్టుబడి రెట్టింపు అయ్యింది. పెరిగిన డీజిల్, ఎరువుల ధరలు, కూలీల ఖర్చు, విత్తనాల ఖర్చు.. ఇట్లా పెట్టుబడి రెట్టింపు అయ్యింది. తెలంగాణలో తప్ప ఏ రాష్ట్రంలోనూ రైతులకు సరిపడా విద్యుత్తు రావడం లేదు. పరిస్థితి ఇట్లా ఉంటే.. మరి నీతి ఆయోగ్ ఏం సాధించినట్టు? దేశంలో మంచినీళ్లు కూడా దొరుకుతలేవు. చివరకు దేశ రాజధానిలో కూడా ట్యాంకర్లతో నీళ్లు కొనుక్కుంటున్నరు. మరి ఈ నీతి ఆయోగ్ తో ఏం ఒరిగినట్టు? నిరుద్యోగ సమస్య నానాటికీ పెరిగిపోతున్నది.
దేశం నుంచి లక్షల కోట్ల పెట్టుబడులు తరలిపోతున్నయి. 16 రాష్ర్టాలలోని మారుమూల గ్రామాల నుంచి ఉపాధిహామీ కూలీలు ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద ధర్నాలు చేశారు. పేదలు, రైతులు, కార్మికులు, చేనేత కార్మికులు.. చివరికి ఉపాధిహామీ కూలీల పొట్టగొట్టే పని చేస్తున్నరు. ఆ పథకాన్ని అమలుచేయటం కేంద్రానికి ఇష్టం లేదు. గత ప్రభుత్వాలు మొదలుపెట్టిన సంక్షేమ పథకాలు, చిహ్నాలను మోదీ సర్కారు చెరిపివేసే కుటిల ప్రయత్నం చేస్తున్నది. ఉపాధి హామీని వ్యవసాయానికి అనుసంధానం మార్చాలని ఇదే నీతి ఆయోగ్ మీటింగ్లో నేను ఎన్నోసార్లు కోరినా పట్టించుకోలేదు. అందుకే ఆ నిరర్థక సమావేశంలో నేను పాల్గొనదలచుకోలేదు. బీడీ కార్మికులపైనా 28 శాతం జీఎస్టీ వేస్తే..చివరకు ఆ పరిశ్రమనే అంతరించిపోతున్నది. విపరీతంగా పెరుగుతున్న నిత్యావసరాల ధరలు.. అదుపులేకుండా పోయిన ద్రవ్యోల్బణం.. జీడీపీ పతనం.. ఇవే నేటి దృశ్యాలు. దేశంలో నిరుద్యోగిత 8.1 శాతానికి చేరింది. రూపాయి అయితే పాతాళలోకానికి పడిపోతున్నది. మరి నీతి ఆయోగ్ ఏం సాధించినట్టు? దేశానికి ఏం ఒరగబెట్టినట్టు?