మహబూబ్నగర్, ఆగస్టు 24 : మహబూబ్నగర్ జిల్లా ప్రభుత్వ జనరల్ దవాఖానలో అప్పుడే పుట్టిన శిశువుకు టీకా వేసే క్రమంలో ఇంజెక్షన్ తొడలో ఇరుక్కుపోయింది. ఈ విషయాన్ని గుర్తించని అక్కడి సిబ్బంది వారిని ఇంటికి పంపించగా.. నెలరోజులు శిశువు నరకయాతన అనుభవించింది. వివరాలు ఇలా.. నారాయణపేట జిల్లాకు చెందిన వెంకటరమణ భార్య అక్షిత డెలివరీ కోసం జూలై 19న మహబూబ్నగర్ జనరల్ దవాఖానలో చేరింది. 20వ తేదీన అక్షిత శిశువుకు జన్మనిచ్చింది. తర్వాత వారం రోజులపాటు దవాఖానలోని ఎన్ఐసీయూలో ఉంచారు. టీకా వేసే క్రమంలో చిన్నారి తొడలో సూది ఇరుక్కుపోయింది. ఈ విషయాన్ని ఎవరూ గుర్తించలేదు. తొడ భాగం వాపు రావడంతో అనుమానంతో తల్లిదండ్రులు డాక్టర్లను సంప్రదించగా.. టీకా వేశామని.. కొద్దిరోజుల తర్వాత వాపు తగ్గిపోతుందని చెప్పి డిశ్చార్జి చేశారు.
ఆ తరువాత వారం, పదిరోజులు దాటినా వాపు తగ్గకపోగా నొప్పితో శిశువు ఏడ్వడం ఎక్కువైంది. దీంతో శిశువును కోస్గి పట్టణంలోని ఓ ప్రైవేట్ దవాఖానకు తీసుకెళ్లగా.. అక్కడ స్కానింగ్ తీయగా.. తొడలో సూది ఉన్నట్టు అక్కడి వైద్యులు గుర్తించారు. ఈ నెల 22న మహబూబ్నగర్ జిల్లా ప్రభుత్వ జనరల్ దవాఖానకు వచ్చి వైద్యులను కలువగా ఆపరేషన్ తొలగిస్తామని చెప్పారు. సోమవారం ఆపరేషన్ చేసి శిశువు కాలి తొడలోంచి 2 ఎంఎం సూదిని డాక్టర్లు తొలగించారు. ఈ ఘటనపై దవాఖాన సూపరింటెండెంట్ అజ్మీరా మాట్లాడుతూ.. శిశువు తొడలో ఉన్నది 2 ఎంఎం సూది అని.. తమ వైద్యశాలలో శిశువులకు కేవలం 0.5 ఎంఎం సూది మాత్రమే వేస్తామని తెలిపారు. ఒక వేళ బయట ఎక్కడైనా ప్రైవేట్ దవాఖానలో తీసుకున్నారా? అన్న విషయమై విచారణ జరిపిస్తామని, ఒకవేళ తమ వద్ద జరిగితే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.