హైదరాబాద్, మే 14 (నమస్తే తెలంగాణ): డిగ్రీలో కొత్తగా కమర్షియల్ గార్మెంట్ టెక్న్టైల్ కోర్సును ప్రవేశపెట్టాలని అధికారులు నిర్ణయించారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో ఈ కోర్సు అందుబాటులోకి రానున్నది. ఈ కోర్సు నిర్వహణకు ఓయూ ముందుకు రాగా.. మరికొన్ని కాలేజీలు ఆసక్తి చూపుతున్నాయి.
ఇప్పటికే ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ అనుబంధంగా ఒక ప్రైవేట్ కాలేజీలో ఈ కోర్సు నిర్వహిస్తున్నారు. అలాగే రెండేండ్ల క్రితం ఇంటర్ ఒకేషనల్ కోర్సుల్లో భాగంగా గార్మెంట్ అండ్ టెక్స్టైల్ కోర్సును పలు ప్రభుత్వ కాలేజీల్లో ప్రవేశపెట్టారు. వీరు డిగ్రీలో చేరేందుకు వీలుగా బీఎస్సీ ఇన్ కమర్షియల్ గార్మెంట్ టెక్స్టైల్ టెక్నాలజీ కోర్సును ప్రవేశపెట్టాల్సి ఉన్నది. ఈ మేరకు ఇంటర్ విద్య కమిషన్ సయ్యద్ ఉమర్ జలీల్, కళాశాల విద్య కమిషనర్ నవీన్మిట్టల్కు లేఖ రాశారు. స్పందించిన అధికారులు ఈ కోర్సు నిర్వహణకు చర్యలు చేపట్టారు. ఇంటర్లో ఒకేషనల్ కోర్సులుగా ఉన్న ఫిషరీస్, ఫారెస్ట్రీ, డెయిరీ సైన్స్, సెరికల్చర్, ఆఫీస్ మేనేజ్మెంట్ తదితర కోర్సులను డిగ్రీలోనూ ప్రవేశపెట్టారు. ఈ ఏడాది బీఎస్సీ ఇన్ కమర్షియల్ గార్మెంట్ టెక్స్టైల్ టెక్నాలజీ కోర్సు ప్రారంభం కానున్నది.
బీకాం కంప్యూటర్సే ఇవ్వండి..
డిగ్రీలో సంప్రదాయక కోర్సుల రద్దుకు పలు కాలేజీలు సిద్ధపడుతున్నాయి. ఈ ఏడాది బీఏ కోర్సు మూసివేతకు కొన్ని కాలేజీలు దరఖాస్తులు సమర్పించాయి. 2022 -23 విద్యాసంవత్సరానికి పాత కోర్సుల రద్దు, వాటి స్థానంలో కొత్త కోర్సుల కోసం పలు కాలేజీలు ఉన్నత విద్యామండలికి దరఖాస్తులు సమర్పిస్తున్నాయి. ఎక్కువ సంస్థలు బీకాం కంప్యూటర్స్ కోర్సు ఇవ్వాలని కోరుతున్నాయి. బీబీఏ, బీఎస్సీ న్యూట్రిషన్ కోర్సుల కోసం కూడా కాలేజీలు దరఖాస్తులు సమర్పిస్తున్నాయి. తెలుగు మీడియం కోర్సులను రద్దుచేసి, ఇంగ్లిష్ మీడియం కోర్సుల వైపు కాలేజీలు చూస్తున్నట్టు అధికారులు తెలిపారు.