నందికొండ, జూన్ 29 : నాగార్జునసాగర్ ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వలకు పాత గేట్ల స్థానంలో కొత్తవి ఏర్పాటు చేసే పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. కాల్వల నుంచి నీటి విడుదల కోసం కుడి కాల్వకు 9, ఎడమ కాల్వకు 3 గేట్లు ఉన్నాయి. వీటిని ఏర్పాటు చేసి 50 ఏండ్లు కాగా ప్రస్తుతం తుప్పుపట్టాయి. 2020లో కుడికాల్వ గేటు ఒకటి విరిగిపోయి నీటి ఉధృతికి కొట్టుకుపోవడంతో 2021లో కొత్తది ఏర్పాటు చేశారు. దాంతో కొత్త గేట్ల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.5.5 కోట్లు విడుదల చేసింది. ఎడమ కాల్వకు 10 అడుగుల ఎత్తు, 25 అడుగుల వెడల్పుతో మూడు గేట్లు, కుడి కాల్వకు 10 అడుగుల ఎత్తు, 15 అడుగుల వెడల్పుతో 8 గేట్లను ఏర్పాటు చేయనున్నారు.
గేట్ల ఏర్పాటు పనుల టెండర్ను స్వప్న కంపెనీ దక్కించుకోగా.. ఎడమ కాల్వ హెడ్ రెగ్యులేటర్ సమీపంలో పనులను ప్రారంభించింది. మొదటగా ఎడమ కాల్వకు సంబంధించిన గేట్లను ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే రెండు గేట్ల తయారీ పూర్తి కాగా మూడోది కూడా తయారు చేసి జూలై చివరిలోపు వాటిని ఎడమ కాల్వకు అమర్చనున్నారు. దాంతోపాటు నాగార్జునసాగర్ డ్యామ్కు ఉన్న రేడియల్ క్రస్ట్ గేట్ల రోప్స్ మార్పిడికి రాష్ట్ర ప్రభుత్వం రూ.80 లక్షలు విడుదల చేయగా ఆ పనులు చేపట్టేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. గేట్ల ఏర్పాటు పనులు వేగంగా సాగుతున్నట్టు ఎన్నెస్పీ ఎస్ఈ ధర్మానాయక్ తెలిపారు. ఆ తర్వాత కుడి కాల్వకు గేట్లను అమర్చే పనులు చేపడతామన్నారు.