(స్పెషల్ టాస్క్బ్యూరో) హైదరాబాద్, సెప్టెంబర్ 3(నమస్తే తెలంగాణ) : ‘నిజమైన ప్రతిభకు ప్రచారం అవసరం లేదు.. గుర్తింపు దానికదే వస్తుంది’ అని పెద్దలు అంటారు. అయితే, కొందరు తమకు ప్రచారం దక్కాలనే యావతో ఏదో చేయబోయి నవ్వులపాలవుతారు. ఇప్పుడు సీఎం రేవంత్ సోదరు డు అనుముల కొండల్రెడ్డి కుమారుడు నయన్రెడ్డి పరిస్థితి సరిగ్గా అలాగే తయారయ్యింది. ప్రఖ్యాత ఫోర్బ్స్-30 జాబితాలో తనకు చోటు దక్కిందని నయన్ చేసుకొన్న ప్రచారమంతా ఉత్తదేనని తేలిపోయింది. ఈ మేరకు ఇంగ్లిష్ వెబ్సైట్ ‘సౌత్ ఫస్ట్’ ఓ కథనం ప్రచురించింది.
వినూత్న ఆలోచనలతో వివిధ రంగాల్లో విజయాలను నమోదు చేసిన 30 ఏండ్లలోపు వయసున్న 30మంది యువ పారిశ్రామికవేత్తలు, ప్రభావశీలుర జాబితాను ప్రఖ్యాత పత్రిక ఫోర్బ్స్ ‘30 అండర్ 30’ పేరిట గత జనవరిలో స్పెషల్ ఎడిషన్ విడుదల చేసింది. ఈ జాబితాలో తనకు చోటు దక్కినందుకు చాలా గర్వంగా ఉన్నదంటూ నయన్ చెప్పుకొచ్చారు. తన గురించి ఫోర్బ్స్ ప్రత్యేకంగా ఓ ఆర్టికల్ రాయడం థ్రిల్ కలిగించిందంటూ ఓ క్లిపింగ్ను జత చేస్తూ గత జనవరిలో తన లింక్డ్ ఇన్ ఖాతాలో పోస్ట్ చేశాడు. అయితే, దీనిపై ‘సౌత్ ఫస్ట్’ ప్రతినిధులు ‘ఫోర్బ్స్ ఇండియా’ యాజమాన్యాన్ని సంప్రదించారు. ‘30 అండర్ 30’ జాబితాకు నయన్ సెలక్ట్ అయ్యారా? ఆయన షేర్ చేసిన ఆర్టికల్ ఫోర్బ్స్ ఇండియాదేనా? అని వివరణ కోరారు. దీనిపై స్పందించిన ఫోర్బ్స్ ఇండియా ఎడిటోరియల్ వర్గాలు.. నయన్ షేర్ చేసిన ఆర్టికల్ క్లిపింగ్లు తాము రాసినవి కాదని పేర్కొన్నాయి. అంతేకాదు.. లిస్ట్లో నయన్ పేరు లేదని స్పష్టంచేశాయి. ఈ మేరకు ‘సౌత్ ఫస్ట్’ పత్రిక వెల్లడించింది.
ఫోర్బ్స్ ఇండియా ఎడిటోరియల్ వర్గాల సమాధానం తెలుసుకొన్న అనంతరం ‘సౌత్ ఫస్ట్’ ప్రతినిధులు ఇదే అంశంపై నయన్ను సంప్రదించారు. దీనికి నయన్ సమాధానం ఇస్తూ.. తాను ‘బ్రాండ్ కనెక్ట్’ విభాగంలో ఫీచర్ అయ్యానని తెలిపారు. 30 అండర్ 30 అవార్డు గ్రహీతల జాబితాలో తాను లేనని నయన్ స్పష్టం చేసినట్టు ‘సౌత్ ఫస్ట్’ వెల్లడించింది.
జనవరి 9, 2026 నాటి ఫోర్బ్స్ ఇండియా ప్రత్యేక సంచికలో ఒక నోట్ ఉంది. దాని ప్రకారం ‘బ్రాండ్ కనెక్ట్’ కింద వచ్చే పేజీలు చెల్లింపు ప్రకటనలకు(అడ్వైర్టెజ్మెంట్) సమానమైన పెయిడ్ ఆర్టికల్స్ అని, వాటిని ఫోర్బ్స్ ఇండియా జర్నలిస్టులు రాయరని స్పష్టంగా ఉన్నది. దీన్నిబట్టి నయన్రెడ్డి తన లింక్డ్ ఇన్ ప్రొఫైల్లో చెప్పుకొన్నట్టు ఆయన ఫోర్బ్స్ లిస్ట్లో ఎంపిక కాలేదు. కేవలం తన ప్రచారం కోసం ఓ పెయిడ్ ఆర్టికల్ను వేయించుకొన్నట్టు స్పష్టమవుతున్నది. ఇది తెలిసిన నెటిజన్లు.. ‘ప్రచారం యావలో పడి ఇన్ని అబద్ధాలు ఆడటం ఎందుకు? చివరకు దొరికిపోవడం ఎందుకు?’ అంటూ మండిపడుతున్నారు.